శాసనసభాపతికి అవమానం, దళితులు ర్యాలీచేస్తే పసుపునీళ్ళతో శుద్ధి.. గవర్నర్ కు మంత్రుల విజ్ఞప్తి!
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల వేళ కుల రాజకీయాలు పీక్స్ కు చేరాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గవర్నర్ గడ్డం ప్రసాద్ ను అత్యంత అవమానకరంగా మాట్లాడటం, సమాజంలో కుల వివక్షను చూపించేలా బీఆర్ఎస్ చేస్తున్న రగడ నేపధ్యంలో కాంగ్రెస్ మంత్రులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్భవన్కు వెళ్లి వినతిపత్రం అందజేశారు. శాసనసభ లోపల, బయట దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాజీ పార్టీలా ప్రవర్తిస్తుందని టార్గెట్ చేశారు. తెలంగాణను అంటరానితనం ఉన్న చీకటి యుగంలోకి తీసుకెళ్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో కుల వివక్షను మళ్ళీ తెరమీదకి తెచ్చిందని అన్నారు.

ఈ నెల 8న అసెంబ్లీ ఎదుట జరిగిన బీఆర్ఎస్ నేతల ఆందోళన, తదనంతర పరిణామాలను మంత్రులు గవర్నర్ శివ ప్రసాద్ శుక్లాకు వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత పదాలు వాడి దళిత సమాజం, మహిళలను అవమానించారని ఆరోపించారు.
అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సహా నేతలు చొక్కాలు విప్పి పోలీసులపై విసిరారని, మహిళా పోలీసులపై అభ్యంతరకరంగా ప్రవర్తించారని, కేటీఆర్ నేతృత్వంలో భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. దళితులు శాంతియుతంగా కేసీఆర్ క్షమాపణ కోరి ర్యాలీ చేస్తే, దానికి రోడ్లపై పసుపు నీరు, పాలు చల్లి అంటరానితనం ప్రదర్శించారని, ఆ ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అన్నారు.
ఇది కావాలని తెలంగాణా సమాజంలో దళితుల పట్ల చిన్న చూపు ప్రదర్శించటం అన్నారు. దీనివల్ల సామాజిక శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఈ తరహా కుట్రలు తెలంగాణా సమాజానికి మంచిది కాదన్నారు. ఈ ఘటనల్లో పాల్గొన్నవారితో పాటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కోరారు.













Click it and Unblock the Notifications
