జగన్, కెసిఆర్ చాలని అనుకుంటోంది: పార్టీపై తోట
ఏలూరు/ న్యూఢిల్లీ: రాష్ట్రవిభజన చేసి అటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ఇటు సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉంటే చాలని తమ పార్టీ అధిష్టానం భావిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోవటంలేదని ఆయన అన్నారు.
జగన్పై 24 కేసులు ఉంటే కేవలం 10 కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేసి సిబిఐ దర్యాప్తు ముగించిందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో విమర్శించారు. దీని వేనుక అధిష్ఠానం హస్తం ఉందని ఆయన మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నారని, అధిష్టానం తెలంగాణ వ్యవహారంలో వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్కు సీమాంధ్రలో భంగపాటు తప్పదని తోట త్రిమూర్తులు హెచ్చరించారు.
ప్రత్యేక తెలంగాణపై త్వరగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు. మంగళవారం షిండేను తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కలుసుకున్నారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. బిల్లును పార్లమెంట్లో పెట్టడం ఆలస్యం అయితే తెలంగాణలో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని తెలిపామని చెప్పారు.
తెలంగాణ నోట్ ఇంకా పూర్తి కాలేదని షిండే చెప్పారని జానారెడ్డి అన్నారు. నోట్ను పూర్తి చేసేందుకు కేంద్ర హోంశాఖ తీవ్ర కసరత్తు చేస్తోందని చెప్పారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని కేంద్ర మంత్రి బలరాంనాయక్ పునరుద్ఘాటించారు.