అదిరిందయ్యా చంద్రం రిలీజ్ (వీడియో), కేసీఆర్ ఓయుకి రాగలవా: మందకృష్ణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏడాది పాలన పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 'అదిరిందయ్యా చంద్రం' పేరుతో ఓ సీడీని విడుదల చేసింది. అందులో చంద్రబాబు ఇచ్చిన హామీలను, ఆయన నెరవేర్చని హామీలను కాంగ్రెస్ వివరించింది.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు. ఇది మహానాడు కాదని, దగానాడు అని రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన తమ పోరాటం ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు.
విద్యార్థుల జోలికి వస్తే కేసీఆర్ పతనం ఆరంభమే: మందకృష్ణ
ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల జోలికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రావొద్దని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వేరుగా హెచ్చరించారు. సెక్యూరిటీ వదిలి ఓయూకు వస్తే కేసీఆర్ ధైర్యవంతుడేనని ఒప్పుకుంటానని చెప్పారు.
విద్యార్థుల జోలికి వస్తే కేసీఆర్ పతనం ఆరంభమే అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ఓయూ భూములను వెనక్కివ్వాలన్నారు. కేబీఆర్ పార్క్, గోల్ఫ్ కోర్స్ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.