చిరంజీవి కి కాంగ్రెస్ షాక్ - తాజా కామెంట్స్ వెనుక: కీలక నిర్ణయం దిశగా..!!
మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా..కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి ఆ తరువాత పార్టీకి దూరమయ్యారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. తాజాగా..చిరంజీవి వాయిస్ తో ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు అయిన ఒక ఆడియో సందేవం..ఆ వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చూస్తుంటే సమీకరణాలు మారుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం..రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత చిరంజీవి ఇక పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఆయనను ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాలంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కోరినా ససేమిరా అన్నారు. కానీ, ఆయన పార్టీకి మాత్రం అధికారికంగా రాజీనామా చేయలేదు.

చిరంజీవి తాజా ఆడియో సందేశం వెనుక కారణం..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. అందులో భాగంగా పార్టీ నేతలకు ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ బాధ్యతలు కేటాయిస్తోంది. ఇక..ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సినిమా అంశాల పైన పలు మార్లు జగన్ తో భేటీ అయ్యారు. సినిమా అంశాల పైన చర్చలు చేసారు. దీంతో..వైసీపీ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు చిరంజీవి క్రేజ్ ను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రయత్నాలు చేసారు, బీజేపీలోకి రావాలని .. జనసేన- బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తే మెగా బ్రదర్స్ నుంచే సీఎంగా అవకాశం ఇస్తామని ఆఫర్ వచ్చింది. అయినా.. పవన్ తో కలిసి ముందుకు వెళ్లండంటూ చిరంజీవి సూచించారు. ఆ తరువాత ఈ ప్రచారానికి ముగింపు చెప్పేందుకు తాను రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని, తాను సినిమాల పైనే ఫోకస్ పెట్టానని చిరంజవి స్పష్టంగా వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా..లేటెస్ట్ గా
ఈ క్రమంలోనే చిరంజీవి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో సిద్దమవుతున్న రీమేక్ మూవీ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఒక వీడియో విడుదల చేసారు. అందులో తాను రాజకీయాలను వదిలినా, రాజకీయాలు తనను వదలటం లేదంటూ చెప్పిన డైలాగ్ పోస్టు చేసారు. ఇది గాడ్ ఫాదర్ లో డైలాగు గా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాజాగా చిరంజీవికి పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ కీలక బాధ్యతలు అప్పగించి షాక్ ఇచ్చింది. పార్టీలో క్రియాశీలకంగా లేని చిరంజీవిని..అధ్యక్ష ఎన్నికల్లో పీసీసీ డెలిగేట్ గా నియమించారు. ఈ మేరకు చిరంజివి ఫొటోతో ఐడీ కార్డును పంపారు. కాంగ్రెస్ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతీ నియోజకవర్గానికి ఇద్దరు పీసీసీ డెలిగేట్లు ఉంటారు. చిరంజీవికి కొవ్వూరు నియోజకవర్గ బాధ్యతలు కేటాయించారు. ఆయన అక్కడ నుంచి పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పీసీసీ డెలిగేట్ గా ఓటు హక్కు వినియోగించుకొనే వీలు కల్పిస్తూ ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ కొత్తగా కార్డు మంజూరు చేసింది.

మెగాస్టార్ అంగీకరిస్తారా..తిరస్కరిస్తారా
ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి అటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ ఇటు జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి చిరంజీవికి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ ఒక విధంగా ఊహించని విధంగా పార్టీ చిరంజీవికి షాక్ ఇచ్చింది. దీంతో..ఇప్పుడు చిరంజీవి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొనే సమయం వచ్చింది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం..లేదా, ఈ ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉండటం. దీని పైన చిరంజీవి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత చిరంజీవి యూపీఏ -2 లో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ అప్పగిస్తున్న బాధ్యతల పైన చిరంజీవి ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications