స్పెషల్ లేదా మోడ్రన్ స్టేటస్, మళ్లీ వద్దు: సుజన, మిథున్పై కేసును చూడండి: మోడీకి వైసిపి
న్యూఢిల్లీ/చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మళ్లీ రాష్ట్రాల ఏకాభిప్రాయం అవసరం లేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి మంగళవారం అన్నారు. విభజన బిల్లు సమయంలోనే రాజ్యసభ వేదికగా ప్రత్యేక హోదా కోసం ఆమోదం తెలిపారని చెప్పారు.
కాబట్టి ప్రత్యేక హోదా కోసం అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం మళ్లీ అవసరం లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదా మోడ్రన్ స్టేటస్ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం దీనికి సానుకూలంగా ఉందన్నారు.
మిథున్ రెడ్డిపై రాజకీయ కుట్ర: వైసిపి ఎమ్మెల్యేలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పైన కేసు వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, శ్రీనివాసులు తిరుపతిలో ఆరోపించారు. దురుద్దేశపూర్వకంగానే ఈ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే రక్షణ లేకపోతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కలుగజేసుకోవాలన్నారు. వెంటనే మిథున్ రెడ్డి పైన పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.