టీడీపీ నుండి పోటీ తప్పా ? అందుకే బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసా ? : వెల్లంపల్లి పై ఆనంద్ సూర్య ఫైర్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీలో వేధింపులు, బెదిరింపులు , దాడులు, దౌర్జన్యాలు కొనసాగాయని తెలుసు. ఇక ఎన్నికలు ఆరు వారల పాటు వాయిదా పడినప్పటికీ బెదిరింపులు, వేధింపులు మాత్రం ఆగటం లేదు . టీడీపీ నుండి పోటీ చేసినందుకు బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసు పెట్టి ఇరికించారని , మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శివశర్మపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు . తమ అధినేత మన్ననలు పొందడం కోసం, వైసీపీమంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకెందరిని బలిపశువులను చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్
శివరామశర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మంత్రి పనే
విజయవాడ పురపాలక ఎన్నికల్లో 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కప్పగంతు శివరామశర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు . ఇక ఎన్నికల్లో టీడీపీ నుండి కాకుండా వైసీపీ నుండి పోటీ చెయ్యాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బెదిరించారని ఆయన టీడీపీ నుండి పోటీ చెయ్యటంతో అతనిపై పోలీసులతో బలవంతంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడని టీడీపీనేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు.
టీడీపీ నుండి పోటీ చెయ్యటమే నేరం
మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన మంత్రి వెల్లంపల్లిపై విరుచుకుపడ్డారు . తన మాట వినకుండా, టీడీపీనుంచి పోటీలో నిలిచాడన్న అక్కసుతో బ్రాహ్మణుడైన వ్యక్తిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత మంత్రి వెల్లంపల్లికే దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఇక తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్న మంత్రి చర్యలను, అహంకారాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కప్పగంతు శివరామశర్మ, కులమతాలకు అతీతంగా, అందరిచేతా మంచివాడిగా మన్ననలను పొందారని చెప్పారు .
బ్రాహ్మణులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
టీడీపీ తరుపున నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తపై తప్పుడు కేసుపెట్టి, రిమాండ్ విధించి, అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారని అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు . మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇప్పటికైనా తన మనసు మార్చుకొని, బ్రాహ్మణులపై పెట్టిన కేసులు ఉపసంహరింపచేయాలని వేమూరి శివరామ శర్మ డిమాండ్ చేశారు. ఇప్పటికే వైసీపీని , వైసీపీ అధినేత జగన్ ను దేశవ్యాప్తంగా అందరూ ఏవగించుకుంటున్నారనే విషయం వెల్లంపల్లి తెలుసుకోవాలని చెప్పారు . 151 మంది శాసనసభ్యులు చేస్తున్న చేష్టలు, హత్యాయత్నాలవల్ల వారెంతో ప్రజలకు అర్ధ అవుతుందని చెప్పారు.
Recommended Video
అట్రాసిటీ కేసులు పెట్టించిన వారికి బ్రాహ్మణుల శాపం తగులుతుంది
టీడీపీ తరుపున నామినేషన్లు వేసేవారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిన భయపెట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని భావిస్తున్న వైసీపీనేతలు, మంత్రులు ఎంతటి నీచస్థాయికి దిగజారారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాకంటక పాలనసాగిస్తున్నరాష్ట్ర పాలకులను ప్రజలు తరిమితరిమి కొట్టేరోజు దగ్గర్లోనే ఉందని ఆనంద్ సూర్య తేల్చి చెప్పారు . బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసు పెట్టించిన వారికి, కచ్చితంగా బ్రాహ్మణుల శాపం తగిలి తీరుతుందన్నారు. తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని, లక్షలకోట్లు సంపాదించి, ఏ1 ముద్దాయిగా ఉన్నవ్యక్తి జగన్ అని ఇక ఆయన ఇతరులను తప్పుపట్టడం హస్యాస్పదంగా ఉందన్నారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆనంద సూర్య పేర్కొన్నారు.