బెజవాడలో రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు-ధర్నాచౌక్ లో భిక్షాటన-నాడు పోషకులం.. నేడు యాచకులం
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకు రోడ్డున పడుతున్నాయి. పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా వైసీపీ ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఆదేశాల్ని సైతం ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో కాంట్రాక్టర్లు చెప్పుకునే దిక్కులేక ఇవాళ విజయవాడ ధర్నాచౌక్ లో భిక్షాటన చేసి నిరసన తెలుపుతున్నారు.
టీడీపీ హయాంలో పనులు
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే పనులు పూర్తయినా టీడీపీ సర్కార్ బిల్లులు చెల్లించే పరిస్ధితి లేక వెళ్లిపోయింది, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పటి పనులకు ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందుల పాలవుతున్నారు. వారి కుటుంబాల పరిస్ధితి దయనీయంగా మారిపోయింది. ఒకప్పుడు కోట్ల రూపాయలు చూసిన వారే ఇప్పుడు అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి.
వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించక
వైసీపీ సర్కార్ హయాంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో పనులు చేయడమే పాపం అన్నట్లుగా కాంట్రాక్టర్ల పరిస్ధితి మారిపోయింది. ప్రభుత్వం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా బిల్లులు రాకపోవడంతో చేసిది లేక వీరంంతా హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా వీరి పిటిషన్లు విచారించిన తర్వాత బిల్లులు చెల్లించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఆదేశాల్ని లెక్క చేయటం లేదు. విజిలెన్స్ విచారణలు, కేంద్రం నిధుల ఆలస్యం వంటి కారణాలు చూపుతూ బిల్లుల చెల్లింపు ఆలస్యం చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఇవాళ రోడ్డెక్కారు. విజయవాడ ధర్నాచౌక్ లో అర్ధ నగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. నాడు పోషకులం.. నేడు యాచకులం అంటూ బ్యానర్లు పెట్టి మరీ కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఉంటాము మీ వెంటే.. మేము మిగిలి ఉంటే అంటూ జగన్ ను వారు వేడుకుంటున్నారు. దీంతో వీరి పరిస్ధితి చూపరులకూ దయనీయంగా మారుతోంది. గతంలో కాంట్రాక్టర్లుగా చెప్పుకుంటే గొప్ప, ఇప్పుడు అలా చెప్పుకునే పరిస్దితి లేదని వీరంతా వాపోతున్నారు.
జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇవే
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. వీటిలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడండి అని వారు కోరుతున్నారు. పనుల తాలూకా పెండింగ్లో బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేమెంట్స్ చెల్లించలేని పనులను రద్దు చేసి డిపాజిట్ లు వెనక్కి ఇవ్వాలని వారు కోరారు. నిధులు, నిర్మాణ స్థలం, డ్రాయింగ్ అఫ్రూవల్స్ లేకుండా టెండర్లు పిలవద్దని ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సూచిస్తున్నారు. నవరత్నాలు తరహాలో కాంట్రాక్టర్ లకు బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. బిల్లులు రాక ఒత్తిడి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు కోరారు. కాంట్రాక్టర్ ల వేదన వినేందుకు సిఎం జగన్ సమయం ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.