శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాల రచ్చ..! కోర్టుకెక్కబోతున్న బీసీవై ?
ఏపీలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలపై మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాద్ తక్కెళ్లపాడుకు వెళ్లి విగ్రహం ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులకు చెప్పారు. అయితే విగ్రహం పెట్టబోమని ప్రకటించి మళ్లీ రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునిచ్చారు. దీనిపై లోకేష్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
దీనిపై స్పందించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్, నిర్వాహకులు, గ్రామస్తులకు, ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్పందించిన హిందూ సంఘాలు, బిసి సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ వివాదం ఇక్కడే ముగియలేదు.

వివాదాస్పద ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన తనపై కొందరు బెదిరింపులకు దిగుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడతామని, కుట్ర చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో తన ఇంటిపై దాడి చేసిన అల్లరిమూకల పరిస్థితి ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వస్తామని కొందరు తనను టార్గెట్ చేసి మాడ్లాడుతున్నారని వాటన్నిటికీ బెదిరే ప్రసక్తే లేదన్నారు.

కొందరు పనిగట్టుకొని శ్రీకృష్ణుడిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసా? అని... ఎన్టీఆర్ వల్లే శ్రీకృష్ణుడికి ప్రాచుర్యం వచ్చిందనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారన్నారు. అలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేవుళ్ల రూపంలో నటుల విగ్రహాల ఏర్పాటు చేసే సంస్కృతి నశించాలన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని ప్రయత్నించినట్టుగానే, శివుడి రూపంలో చిరంజీవిని, అమ్మవారి రూపంలో రమ్యకృష్ణ విగ్రహాలను ప్రతిష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. తెలుగు రాష్ట్రాలలో గతంలో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను వెంటనే తొలగించాలని సిఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని కోరిన ఆయన.. దీనికోసం త్వరలోనే కోర్టులను ఆశ్రయిస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications