ఎస్ఐ కాల్పులు: రాళ్ళు రువ్వి, వాహనాలు ఢీకొట్టిన దొంగలు
అనంతపురం: పశువులను అపహరించేందుకు వచ్చిన దొంగల ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో వెంటాడారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు దొంగల ముఠా సభ్యులు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి దొంగలు పారిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకొంది.
అనంతపురం పట్టణంలో పశువులను దొంగిలించే ముఠా శనివారం తెల్లవారుజామున వచ్చింది. గుత్తి రోడ్డు సమీపంలో పశువులను వాహనంలో ఎక్కిస్తుండగా స్థానికులు అడ్డుకొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.
అనంతపురం సీఐ, ఇద్దరు ఎస్ఐలు, నాలుగు వాహనాల్లో వేర్వేరు దారుల్లో దొంగల కోసం బయలు దేరారు. పోలీసుల వాహనాలను ఢీకొడుతూ దొంగలు ముందుకెళ్ళారు. ఆలమూరు రోడ్డులో పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ దొంగలు పారిపోయారు.
ఆలమూరు రోడ్డు సమీపంలో రోడ్డు పక్కనే దొంగలు తమ వాహనాన్ని నిలిపేశారు.ఈ వాహనాన్ని నాలుగో టౌన్ ఎస్ఐ శేఖర్ అనుసరించాడు. అయితే దొంగల వాహనానికి పోలీసులు తమ వాహనాన్ని అడ్డుపెట్టారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టుకొంటూ దొంగల ముఠా వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళారు.
అటుగా వస్తున్న అంబులెన్స్ను ఆపిన ఎస్ఐ శేఖర్ దొంగల ముఠా వాహనాన్ని వెంబడించాడు. అయితే కొద్ది దూరం వెళ్ళాక దొంగలు తమ వాహనాన్ని రోడ్డు పక్కనే నిలిపేశారు దొంగల వాహనం వెనుకే ఎస్ఐ తన వాహనాన్ని నిలిపాడు. రాళ్ళు రువ్వుతూ అంబులెన్స్ను దొంగల వాహనం వెనక్కి నడుపుతూ ఢీకొట్టారు.
అయితే ఆ సమయంలో దొంగలను నిలువరించేందుకు ఎస్ ఐ శేఖర్ కాల్పులు జరిపాడు. దొంగలు అక్కడి నుండి సురక్షితంగా తప్పించుకొన్నారు. మొత్తంగా ఈ ఘటనపై సీసీటీవి పుటేజీలో చోటు చేసుకొన్న దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.