'విమానాశ్రయ మేనేజర్ను కొట్టింది నిజమే': కాదని అంతా చెప్పిన మిథున్ రెడ్డి
చిత్తూరు: రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైసిపి నేత మిథున్ రెడ్డి అనుచరులు.. ఐదు రోజుల క్రితం రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా రాజశేఖర్ పైన చేయి చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నవంబర్ 26న మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇతరులు మేనేజర్ పైన చేయి చేసుకున్న విషయం తెలిసిందే.
మేనేజర్ రాజశేఖర్ పైన ఎవరు దాడి చేశారో తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా మేనేజర్ పైన చేయి చేసుకున్నట్లు గుర్తించారు. అయితే, ఎవరు ఈ దాడి చేశారనే విషయమై తెలుసుకునేందుకు ఫుటేజీని పూర్తిగా పరిశీలించనున్నారు.
మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, వారి అనుచరులు ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్తో వాగ్వాదానిగి దిగడం, ఆ తర్వాత అతనిని కొట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మేనేజర్ ఏర్పాటు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
నేను కొట్టలేదు: మిథున్ రెడ్డి
తాను ఎయిర్ ఇండియా మేనేజర్ పైన చేయి చేసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవి పూర్తిగా నిరాధారమని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారన్నారు.
సిసిటివి ఫుటేజీ వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను మిథున్ రెడ్డి వివరించారు.
'నవంబర్ 26న హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తిరుపతి విమానాశ్రయంలో దిగాను. పార్టీ అధినేత జగన్ అదే విమానంలో హైదరాబాదుకు వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడి బయటకు వద్దామనుకున్నా.
అదే సమయంలో మేనేజర్ రాజశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం కొందరు తనకు చెప్పారు. సంబంధింత వ్యక్తి కోసం తాను ఎదురు చూశాను. అతను వచ్చాక ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించాను.
సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా నాతో అమర్యాదగా మాట్లాడారు. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత సంబంధిత అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలో క్షమాపణ చెప్పారు' అని మిథున్ రెడ్డి వివరించారు.
ఆ సమస్య అంతటితో ముగిసిందన్నారు. అయితే తాను మేనేజర్ పైన దాడి చేశానని, రాత్రి సమయంలో ఫిర్యాదు చేశారని, అది వాస్తవం కాదన్నారు. సంఘటన జరిగిన సమయం నుంచి రాత్రి వరకు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. దీనిపై తాము లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.