స్నేక్ గ్యాంగ్: వీడియోలు తొలగించారా? సాఫ్టువేర్తో..
హైదరాబాద్: పహాడీషరీఫ్ స్నేక్గ్యాంగ్ సభ్యుల సెల్ఫోన్లను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీసులు సమాయత్తమయ్యారు. దుండగులు తాము పాల్పడిన అకృత్యాలను సెల్లో బందించడాన్నే హాబీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని పలు మెమొరీకార్డుల్లోని దృశ్యాలను భద్రపరిచారు.
అయితే, కొద్ది రోజుల క్రితం నుండి తమ పైన ఉచ్చు బిగుస్తుండటంతో గతంలో నిక్షిప్తం చేసిన దృశ్యాలను ఏమైనా తొలగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే సెల్ డేటా రికవరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు గత ఏడాది చివర్లో సోబరాబాద్ పోలీసులు ఆరు సాఫ్టువేర్లను కొనుగోలు చేశారు.
వీటిలోని ఫోరెన్సిక్ టూల్ కిట్ 5ను ఉపయోగించనున్నారు. సెల్ఫోన్లలో, కంప్యూటర్లలో తొలగించిన డేటాను తిరిగి నిక్షిప్తం చేసేందుకు ఈ సాఫ్టువేర్ ఉపయోగపడుతుంది. అందుకే వాటి ద్వారా స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను పూర్తిస్థాయిలో సేకరించేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు, పోలీసులు స్నేక్ గ్యాంగ్ బాధితుల నుండి వివరాలు ఆరా తీస్తున్నారు. స్నేక్ గ్యాంగ్ బాధితులు చాలామంది ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు భయంతో ఫిర్యాదు చేయడం లేదని భావిస్తున్నారు. బాధితులు పూర్తి వివరాలు చెప్పాలని, ఫిర్యాదు చేయాలని సూచించారు.