ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు .. కరోనా నిబంధనలపై ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు
కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో పక్క కేంద్రం కరోనా నియంత్రణ కోసం సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తుంది. ఈ మేరకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. దీంతో అప్రమత్తమైన ఏపీ సర్కార్ మరోమారు కరోనా నిబంధనల అమలు చేసే విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టింది.
భారత్ లో కరోనా విజృంభణ ...గత 24 గంటల్లో 35,871 కొత్త కేసులు ,172 మరణాలు
ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలలో కరోనా నిబంధనలను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న కారణంగా కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉన్నంతవరకు వివిధ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరోమారు అవలంబిస్తే బాగుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు పరిశ్రమలలో,రవాణా వాహనాలలో,యంత్రాల వినియోగంలోనూ శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టవలసిందిగా స్పష్టం చేసింది.
మార్కెట్లలో,షాపింగ్ మాల్స్ లో, పరిశ్రమలలో భౌతికదూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలి అని, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. ఇక క్యాంటీన్లు, డైనింగ్ హాల్స్, హోటల్స్ లో ప్రతి రెండు గంటలకు శానిటైజేషన్ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని , ఏపీ వాసులకు కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది ఏపీ సర్కార్.