కరోనా ఎఫెక్ట్ : మోడీ మాట వినమన్న చంద్రబాబు..జగన్ కు పయ్యావుల లేఖ
కరోనా ... ఈ పేరు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఏపీలోనూ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా మూడు కేసులు నమోదు కాగా కరోనా అనుమానితుల సంఖ్యా కూడా దారుణంగా పెరిగింది. ఇక కరోనా మహమ్మారి పెరుగుతున్న పరిస్థితిపై టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని పార్టీ శ్రేణులను సూచిస్తే , పయ్యావుల కేశవ్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు . ఇక టీడీపీ కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది .

ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు 177దేశాలకు కరోనా విస్తరించిందని, 10వేల మందిపైగా మృతి చెందారని తెలిపారు. టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు . ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అలాగే ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలని పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చంద్రబాబు సూచించారు .

జగన్ కు లేఖ రాసిన పయ్యావుల కేశవ్
ఇక ఏపీలో కరోనా వ్యాప్తి విషయంలో సీఎం జగన్కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక తోడ్పాటు కింద ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు నగదును, అలాగే రెండు నెలల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. కరోనా కారణంగా షట్డౌన్ దిశగా దేశ పరిస్థితులు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులు బ్రతకలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు .

టీడీపీ ఆఫీసుల్లోనూ సందర్శకులు, కార్యకర్తలకు నో ఎంట్రీ
సాధారణ ప్రజలు జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ లేఖలో డిమాండ్ చేశారు. ఇక టీడీపీ కరోనా నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని మోదీ సూచనల మేరకు టీడీపీ ఆఫీసులోకి సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు . అంతేకాదు కరోనా వైరస్ పట్ల ప్రజలకు టీడీపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications