విదేశీయుల వివరాలు చెప్పేందుకు జనం అనాసక్తి- కరోనా వ్యాప్తికి అదే కారణమంటున్న ఏపీ సర్కారు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న విదేశీయులను గుర్తించే విషయంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు. విదేశీయుల వివరాలను పూర్తిస్ధాయిలో గుర్తించడంలో ఇప్పటికే విఫలమైన ప్రభుత్వం.. వాలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే స్ధానికుల నుంచి విదేశీయుల వివరాలు రాబట్టడంలో వాలంటీర్లకు తగిన సహకారం అందడం లేదని తెలుస్తోంది.

విదేశీయుల రాకతో కరోనా ప్రభావం..
ఏపీలో తొలి కరోనా కేసు నుంచి తాజాగా ఇవాళ నమోదైన మూడు కేసుల వరకూ గమనిస్తే మెజారిటీ కేసులు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీసుకొచ్చినవే ఉన్నాయి. విదేశాల నుంచి విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణికులను అధికారులు నేరుగా క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో కొందరు క్వారంటైన్ నుంచి కూడా తప్పించుకుని ఇళ్లకు చేరుకోవడమే కాక పలుచోట్ల సంచరిస్తూ కరోనాను వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు పలుచోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. అయితే వీరి వివరాలను పూర్తిస్ధాయిలో రాబట్టేందుకు మాత్రం ప్రభుత్వానికి కుదరడం లేదు.

వాలంటీర్ల సాయంతో గుర్తింపు..
విదేశాల నుంచి విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు, పోర్టులకు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాలకు చేరుకుని అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన వారిని మాత్రం గుర్తించలేకపోయింది. వీరి గుర్తింపు కోసం ఇప్పటికే వాలంటీర్లు, ఆశావర్కర్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. అయితే ఇందులో పలువురు విదేశీ ప్రయాణికుల వివరాలు రాబట్టగలిగినా పూర్తిస్ధాయిలో మాత్రం సేకరణ సాధ్యం కావడం లేదు.

వివరాలు చెప్పేందుకు స్ధానికుల అనాసక్తి..
తాజాగా గత వారం రోజుల నుంచి ఏపీకి చేరుకున్న వారి వివరాలు సేకరిస్తున్న వాలంటీర్లు.. పలుచోట్ల స్ధానికులను ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా అని ఆరా తీస్తున్నారు. కానీ ప్రస్తుతం కరోనా భయాల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న జనం.. విదేశీయుల వివరాలు తమకు తెలియదనే సమాధానం ఇస్తున్నారు. దీంతో విదేశీయుల వివరాలు సేకరించడంలో వాలంటీర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొందరు తమ బంధువుల్లో విదేశీ ప్రయాణికులున్నట్లు తెలిసినా వివరాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు.

విదేశీయుల వివరాలు తెలిస్తే కానీ..
విదేశాల నుంచి వివిధ మార్గాల్లో స్వస్ధలాలకు చేరుకున్న వారి పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల ప్రభుత్వానికి కరోనా నియంత్రణలో సమస్యలు తప్పడం లేదు. దీంతో నిత్యం ప్రభుత్వం అంచనా వేసిన చోట్ల కాకుండా మిగతా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాంటి సమయాల్లో అధికారులు తిరిగి వీరిపై దృష్టి పెట్టాల్సిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. ముందుగా ఇలాంటి వారి వివరాలు గుర్తిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇవాళ డీజీపీ గౌతం సవాంగ్ కూడా విదేశీయుల వివరాలు బయటపెట్టకపోతే రాష్ట్రానికి భవిష్యత్తులో మరింత ప్రమాదం పొంచి ఉంటుందని విజయవాడలో హెచ్చరించారు.












Click it and Unblock the Notifications