ఏపీలో వైద్య విద్యార్థులపై కరోనా పంజా; కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 50మంది మెడికోలకు కరోనా
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. తన పంజా విసురుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశం ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుంటోంది. కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళన నెలకొంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తిని నివారించడానికి ఆంక్షలను పెట్టాలని కేంద్రం సూచనలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం దేశంలో ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇప్పటికే దేశంలో అనేక పేరెన్నిక గన్న ఆస్పత్రుల్లో వైద్యులు, మెడికల్ కళాశాలల సిబ్బంది కరోనా బారిన పడితే తెలుగు రాష్ట్రాలలోనూ వైద్యులను, వైద్య విద్యార్థులను కరోనా వీడటం లేదు.
కడప జిల్లా రిమ్స్ మెడికల్ కళాశాలలో 50 మంది వైద్యవిద్యార్థులకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకినా విషయం తెలిసిందే. తాజాగా కడప రిమ్స్ వైద్య కళాశాలలోనూ కరోనా కలకలం రేగింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో రిమ్స్ కళాశాలలో రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక వీరిలో 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరికొంత మంది విద్యార్థుల వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉన్నాయి.
వైద్య విద్యార్థులకు కరోనా.. పరీక్షలు వాయిదా వెయ్యాలని కోరిన కళాశాల యాజమాన్యం
వైద్య విద్యార్థులకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కోరింది. రేపు ఫైనల్ పరీక్షలు జరగనుండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వైద్య కళాశాలలో కరోనా కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మెడికల్ కళాశాలలో విద్యార్థులు కరోనా బారిన పడినట్లుగా సమాచారంతో విద్యార్థుల్లో రేపటి పరీక్షలపై ఆందోళన నెలకొంది. మెడికల్ కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలలో పాజిటివ్ గా తేలింది. అయితే వీరికి సన్నిహితంగా ఉన్న వారికి కూడా ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఐసోలేషన్ లో వైద్య విద్యార్థులు
కరోనా మహమ్మారి బారిన పడిన 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు. వీరితో కాంటాక్ట్ లో ఉన్న వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా కరోనాపై సాగిస్తున్న పోరాటంలో ముందువరుసలో నిలిచిన వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండటం ప్రస్తుతం ఆందోళనకు కారణంగా మారింది.