coronavirus: ఏపీలో ఏడుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, విశాఖ యువకుడికి వైరస్..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 33కి చేరగా.. ఏపీలో ఏడుకి చేరాయి. ఇప్పటికే సరిహద్దులు మూసివేసి.. లాక్ డౌన్ ప్రకటించిన పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ పట్టణానికి చెందిన యువకుడికి తాజాా కరోనా పాజిటివ్ సోకింది. అతను ఈ నెల 17వ తేదీన లండన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అతని కుటుంబసభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో ఇప్పటివరకు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు చెప్తున్నారు. విశాఖ యువకుడే కాక ఇదివరకు 65 ఏళ్ల వృద్దుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబంలోని మహిళకు కూడా పాజిటివ్ సోకవడంతో.. వారిద్దరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.
వైరస్ ప్రభావం పెరుగుతోన్న కొద్దీ.. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. సరిహద్దులను మూసివేసి చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు 11 వేల 670 మందికి పరీక్షలు నిర్వహించింది. అయితే అందులో చాలా రిపోర్టులు నెగిటివ్ రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. వైరస్కు సంబంధించి ప్రతీరోజు మెడికల్ బులెటిన్ విడుదల చేస్తోంది.