కరోనా ఎఫెక్ట్ : అమరావతిలో ఉద్యమాలకు బ్రేక్ - ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన జగన్ సర్కార్...
ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపైనా కరోనా వైరస్ ప్రభావం పడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని రాజధానిలో సాగుతున్న ఉద్యమాలకు తాత్కాలికంగానైనా విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వారు రేపోమాపో తమ కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు ఉద్యమ విరమణ విషయంలో అమరావతి అనుకూల, వ్యతిరేక ఉద్యమకారులు మీరు ముందంటే మీరు ముందనే వైఖరి కనిపిస్తోంది.

అమరావతిపైనా కరోనా ప్రభావం
ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తత పెంచింది. విదేశీ ప్రయాణికుల రాకపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించిన నేపథ్యంలో ప్రధాని సూచన మేరకు రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, విద్యాసంస్ధలు, గుళ్లు మూతపడుతున్నాయి. వెలగపూడిలోని సచివాలయంలోనూ కరోనా ప్రభావంతో సందర్శకుల రాక తగ్గింది. అదే సమయంలో అమరావతిలో వంద రోజులు పూర్తి చేసుకుంటున్న రాజధాని ఉద్యమంతో పాటు దానికి పోటీగా మొదలైన బహుజన పరిరక్షణ సమితి ఉద్యమంపైనా కరోనా ప్రభావం పడబోతోంది.

భారీగా ప్రజలు గుమికూడటం వల్ల..
అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు దాదాపు వంద రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వీరు గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఉద్యమం కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి పోటీగా ప్రారంభమైన బహుజన పరిరక్షణ సమితి ఉద్యమం కూడా నానాటికీ పెరుగుతోంది. ఇందులోనూ వందల సంఖ్యలో స్ధానికులు వచ్చి కూర్చుకుంటున్నారు. దీంతో వీరిలో ఏ ఒక్కరికైనా కరోనా సోకితే వారి నుంచి మిగతా వారికి వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఉద్యమాలు విరమించుకోవాలని వారికి సూచిస్తోంది.

రేపోమాపో ఉద్యమాలకు బ్రేక్...
ఇప్పటికే కరోనా ప్రభావంపై ఉద్యమంలో ఉన్న వారికి ప్రభుత్వం సమాచారమిస్తూ అవగాహన కల్పించడం ప్రారంభించింది. దీనికి తోడు మంత్రులు కూడా కరోనా వ్యాప్తి కాకుండా ఉండాలంటే ఉద్యమాలు విరమించుకోవాలని వారిని కోరుతున్నారు. సచివాలయానికి మంత్రులు, సీఎం, సందర్శకుల రాకపోకలు కూడా తగ్గిపోయిన నేపథ్యంలో స్ధానికులకు కూడా పరిస్దితి తీవ్రత అర్ధమవుతోంది. దీంతో రేపో మాపో ఉద్యమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నారు.
Recommended Video

ఉద్యమ విరమణలోనూ పోటాపోటీ...
కరోనా వైరస్ ప్రభావంతో ఉద్యమాలను విరమించాలన్న ప్రభుత్వ వినతి మేరకు తాత్కాలికంగా బ్రేక్ తీసుకునేందుకు అమరావతి అనుకూల, వ్యతిరేక ఉద్యమకారులు సిద్దమయ్యారు. కానీ వీరిలో ఎవరు ముందు ఉద్యమాన్ని విరమించాలన్న అంశంలో ప్రతిష్టంభన నెలకొంది. ముందుగా వారు వెనక్కి తగ్గితే తర్వాత తాము విరమిస్తామని ఎవరికి వారు భీష్మించుకుని కూర్చునే పరిస్ధితి. దీంతో ఉద్యమ విరమణ ఆలస్యమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇగోలకు పోకుండా ఇరు ఉద్యమాలను ఒకేసారి విరమించుకోవాలని ఇరువర్గాలనూ కోరుతోంది.












Click it and Unblock the Notifications