ఏపీలో కరోనా ఎఫెక్ట్ : దర్శనానికి గుళ్లకు రావొద్దంటున్న అధికారులు...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది. అదే సమయంలో గుళ్లకు దర్శనాలకు వచ్చే భక్తులనూ తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గుళ్లలోనూ దర్శనాలను నిలిపివేస్తున్నారు.

గుళ్లపైనా కరోనా ప్రభావం.,
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా కేంద్రం ఇవాళ పలు చర్యలను ప్రకటించింది. జనం ఎక్కువగా తరలివచ్చే అన్ని విద్యాసంస్ధలు, మాల్స్, సూపర్ బజార్లు, ఇతర రద్దీ ప్రదేశాలను మూసివేయాల్సిందిగా ఇవాళ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలోనూ రద్దీ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రతలు తీసుకునేందుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా తిరగొద్దని ప్రజలను హెచ్చరిస్తూనే, గుళ్లకు కూడా దర్శనాలకు వెళ్లొద్దని కోరుతోంది.

ఆలయ దర్శనాల రద్దు..
ఏపీలో ప్రధాన ఆలయాలైన తిరుమల, సింహాచలం, అన్నవరం, శ్రీకాళహస్తి, కనకదుర్గ ఆలయాల్లో దర్శనాలను ఇప్పటికే నిలిపివేస్తున్నారు. ఒక్కసారిగా దర్శనాలు రద్దు చేస్తే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రం మీద కొంతమేర ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా గుళ్లలో దర్శనాలను వాయిదా వేసుకోవాలని దేవాదాయశాఖ కోరుతోంది.

కరోనా భయాలతో తగ్గిన రద్దీ..
కరోనా భయాలతో ఏపీలోని పలు ఆలయాల్లో భక్తుల రద్దీ ఇప్పటికే గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో మిగతా ఆలయాల్లోనూ భక్తుల రాకను నిరుత్సాహపరిచే చర్యలను ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఈ ప్రభావం మరింత పెరిగితే మాత్రం పూర్తిగా ఆలయాలను రద్దు చేసే అలోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకైతే భక్తులను దర్శనాలు వాయిదా వేసుకోవాలని మాత్రమే ప్రభుత్వం కోరుతోంది. పరిస్ధితి తీవ్రతను బట్టి ఆరోగ్యశాఖ సూచన మేరకు తదుపరి చర్యలను ప్రకటిస్తామని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications