ఏపీలో కరోనా వైరస్: మరో రికార్డు.. కొత్తగా 130 కేసులు, 2మృతి.. రేపటి నుంచి మరో టెన్షన్..
ప్రతి 10 లక్షలకుగానూ సగటున 7500పైచిలుకు మందికి టెస్టులు నిర్వహిస్తూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో దేశంలోనే బెస్ట్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక స్థాయిలో 17,695 శాంపిల్స్ ను పరీక్షించింది. కాగా, టెస్టులు భారీగా నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు సైతం అదే స్థాయిలో వెలుగుచూస్తుండటం గమనార్హం.

కొత్తగా 130 కేసులు..
గడిచిన 24 గంటల్లో 17,695 శాంపిల్స్ ను టెస్టుచేయగా.. కొత్తగా 130 మందికి కొవిడ్-19 వ్యాధి నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,718కి పెరిగింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు 810మంది, ఫారిన్ రిటర్నీలు 131 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా ఏ జిల్లాలో ఎంత మంది కొత్తగా కరోనా కాటుకు గురయ్యారనే లెక్కలను సర్కారు వెల్లడించకపోవడం వివాదాస్పదమైంది.

పెరిగిన మరణాలు..
ఆదివారం నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు వైరస్ కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 75కు పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 30 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటనలో తెలిపారు. డిశ్చార్జ్ అయినవాళ్లలో 28 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు, ఒక ఫారిన్ రిటర్నీ, ఒక లోకల్ వ్యక్తి ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. మొత్తం కేసులు 3718కాగా, అందులో 2353మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1290గా కొనసాగుతున్నది.

సరిహద్దులో తనిఖీల్లేవ్..
ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించేవారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. సడలింపుల్లో భాగంగా ఇప్పటికే అంతర్రాష్ట్ర రవాణాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పచ్చజెండా ఊపడం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత సోమవారం నుంచి ఇరు ప్రాంతాల వాళ్లు ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే రాకపోకలు సాగించొచ్చు. అదీగాక సోమవారం నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Recommended Video

గుడ్ న్యూస్.. బ్యాడ్ నంబర్స్..
తెలుగు రాష్ట్రాల మధ్య చెక్ పోస్టుల ఎత్తివేత, ఆర్టీసీ సర్వీసుల పెంపుతోపాటు సోమవారం నుంచి అన్ని మతాల ప్రార్థనా స్థలాలు పున:ప్రారంభం కానున్నాయి. అందరికీ ఇది గుడ్ న్యూసే అయినప్పటికీ.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కొత్త కేసులు భారీగా పెరగొచ్చని అధికార వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఎన్ని కేసులు వచ్చినా తట్టుకునేలా ఆరోగ్య రంగాన్ని సిద్ధం చేసినట్లు ఏపీ, తెలంగాణ సీఎంలు ఇదివరకే ప్రకటన చేయడం ఊరటకలిగించే అంశం.












Click it and Unblock the Notifications