ఏపీలో కరోనా విలయంపై సీఎం జగన్.. మర్కజ్తో సీన్ రివర్స్.. లాక్డౌన్ సడలింపులు..
''ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వాళ్లు పాపం చేసినట్లుకాదు. ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనికూడాలేదు. నిజానికి కరోనా వైరస్ జ్వరం లాంటిదే. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా తగ్గిపోతుంది. వయసుపైబడిని, వేరే రోగాలతో బాధపడుతున్నవాళ్లకు మాత్రమే ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వైరస్ గురించి మరీ ఎక్కువగా బాధపడొద్దు. అన్నింటికీ మించి వైరస్ సోకినవాళ్లపట్ల వివక్ష చూపకండి. సామాజిక దూరం పాటిస్తూనే బాధితుల పట్ల ప్రేమగా వ్యవహరించండి. మీకు ఏం జరిగినా చూసుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'' అని ముఖ్యమంత్రి వైస్ జగన్ భరోసా ఇచ్చారు.
ఏపీలో కొవిడ్-19 కేసులు ఒక్కసారే పెరిగిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు రెట్టింపైన నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బుధవారం మీడియా ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, ప్రభుత్వ సన్నద్ధత, జీతాల చెల్లింపు వాయిదా లాంటి అంశాలతోపాటు కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపుపైనా ఆయన కీలక ప్రకటనలు చేశారు. సీఎం ఏం చెప్పారంటే..

ఢిల్లీ నుంచి 1085 మంది..
‘‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మనం ముందునుంచే సన్నద్ధమై ఉన్నాం. వైరస్ లక్షణాలను గుర్తించడం దగ్గర్నుంచి, చికిత్స అందించి, నయం చేసేదాకా సమగ్ర విధానాలను అవలంభించాం. కానీ గడిచిన రెండ్రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధాకారం. దానికి కారణం.. ఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన ఓ సదస్సు. అక్కడొకొచ్చిన విదేశీయుల ద్వారా మనవాళ్లకు వైరస్ సోకింది. ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ వెళ్లొచ్చినట్లుగా గుర్తించాం. వెంటనే అప్రమత్తమై వాళ్లను ట్రేస్ చేసి వైరస్ వరింతగా వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాం.

వాళ్ల జాడ దొరకలేదు..
ఏపీలో ఇప్పటిదాకా 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 70 మంది ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. అక్కడికి వెళ్లొచ్చిన 1085 మందిలో ఇప్పటికే 585 మందికి సంబంధించి టెస్టుల ఫలితాలొచ్చాయి. అలా 70 మంది ఎఫెక్టెడ్ అని తేలింది. మరో 500 మందికి సంబంధించి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకో 21 మంది అనుమానితుల జాడ తెలియాల్సి ఉంది. వాళ్లను ట్రేస్ చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం కొన్ని ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు..

85 శాతం మందికి ఇంట్లోనే..
కరోనా వైరస్ సోకితే ఏదో జరగరానిది జరిగినట్లు భావించొద్దు. సాధారణ జ్వరంలాగే కరోనా కూడా 14 రోజుల వ్యవధిలో నయమైపోతుంది. పెద్ద వయసున్నవాళ్లు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ స్టడీలో తేలింది. అదీగాక, వైరస్ సోకినవాళ్లలో 85 శాతం మందికి ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండగానే జబ్బు నయమైపోయింది. మొత్తం కేసుల్లో 14 శాతం మందిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్పించారు. అందులోనూ 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చేర్పించేంత క్రిటికల్ అయింది. కాబట్టి కరోనాను బూచిగా భావించొద్దు. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా, దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా గ్రామవాలంటీర్లకు చెప్పండి.. ఆ తర్వాత మీ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.

వాటికి లాక్ డౌన్ వర్తించదు..
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి పొలం పనులు కచ్చితంగా సాగాల్సిందే. మిగతా అంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, అత్యవసరం కాబట్టి రైతాంగానికి దాన్నుంచి మినహాయింపు ఇస్తున్నాం. రైతులు, రైతు కూలీలు, అక్వారంగంలోని వాళ్లు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. కానీ పనిలో సామాజిక దూరాన్ని పాటించాలి. గుంపులుగా కాకుండా దూరంగా నిలబడాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేసుకుని ఇళ్లకు వెళ్లిపోవాలి. అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు కూడా పని చేసుకోవచ్చు.

అందరికీ థ్యాంక్స్..
కరోనా లాక్ డౌన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. నిల్వలు కూడా మందగించే పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వైద్య సదుపాయాల కోసం ఖర్చులు పెరిగాయి. తద్వారా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇలాంటి కష్ట సమయంలో తమ జీతాలను పోస్ట్ పోన్ చేయడానికి అంగీకరించిన ఉద్యోగులు, టీచర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెన్షనర్లు.. అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నా.

ప్రైవేటు సహకారం..
మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తున్నది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సుల సేవల్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఒకవేళ అది మిస్ అయినా, ఇంకెవరికైనా వైద్య సిబ్బందికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశముంన్నా వెంటనే 104 కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. దయచేసి సహకరించండి'' అని సీఎం జగన్ రిక్వెస్ట్ చేశారు.
Recommended Video

పారాసిటమాల్.. జ్వరం..
కరోనాకు పారాసిటమాలే మందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై దుమారంరేగినా.. చివరికి అది నిజమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తేల్చడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కూడా వైరస్ భయాలను దూరం చేయడానికే ఆయన కరోనాను.. సాధారణ జ్వరంతో పోల్చారు. జ్వరానికి తీసుకున్నట్లే కరోనాకు కూడా చికిత్స తీసుకోవాలని, వైరస్ సోకినంత మాత్రాన భయపడిపోవాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అలాగే, కరోనా బాధితుల పట్ల విక్ష చూపొద్దని, ప్రేమాభిమానాలు పంచాలని కోరారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా 104కు ఫోన్ చేయాలని సీఎం జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications