ఏపీలో కరోనా: గుండెలు కాపాడుకోండి.. సీఎం జగన్ పనితో దేశానికి ఊరట.. కేంద్రం అనూహ్య స్పందన..
కొన్ని సార్లు చాలా చిన్న నిర్ణయాలే పెనుప్రమాదాన్ని తప్పిస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్) నిబంధనలు 'నొ' చెబుతున్నా, వాటిలో తయారయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ డ్రగ్స్ ఎగుమతుల్ని ప్రధాని నరేంద్ర మోదీ నిషేధించారు. తద్వారా కొంతలోనైనా కొవిడ్-19 విలయం ప్రభావాన్ని తగ్గించారాయన. ఇదేకాదు, కరోనా తెరపైకి వచ్చినప్పటి నుంచీ వైద్య సిబ్బంది రక్షణ కోసం వాడే 'పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్వీప్మెంట్(పీపీఈ)' కిట్స్ కొరత వేధిస్తున్నది. ఏపీలో సొంతగా పీపీఈల తయారీ చేపట్టాలన్న సీఎం జగన్ నిర్ణయం కూడా ఇప్పుడు దేశానికి ఊరటనిస్తున్నది. భారీ ఖర్చుతో చైనా నుంచి తెప్పించిన పీపీఏలు సరిపోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏపీ సర్కారువైపు ఆశగా చూస్తున్నది.

మూలపేటలో పీపీఏల తయారీ
కరోనా ఒక్కసారే అన్ని దేశాలపై విరుచుకుపడటంతో ప్రపంచమంతటా వైద్య పరికరాల కొరత ఏర్పడింది. ప్రధానంగా కొవిడ్-19 పేషెంట్లకు సేవలందిచే వైద్య సిబ్బందికి వైరస్ నుంచి రక్షణ కల్పించే పీపీఏలకు భారీ డిమాండ్ నెలకొంది. మన దేశంలో పలు రాష్ట్రాలు చైనా దిగుమతులు తెప్పించుకున్నా, వాటితో అవసరాలు పూర్తిగా తీరలేదు. దీంతో ఏపీ సీఎం జగన్.. స్థానికంగానే పీపీఏల తయారీకి అవకాశాలు పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. అలా.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో పీపీఈల తయారీ సోమవారం నుంచే మొదలైంది.

పక్కా ప్లానింగ్తో..
కొత్త మూలపేట సెజ్(కాకినాడ సెజ్)లో ‘పాల్స్ ప్లస్' అనే బొమ్మల తయారీ పరిశ్రమ ఉంది. అక్కడ వందల సంఖ్యలో కుట్టుమిషన్లు అందుబాటులో ఉన్నాయి. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పీపీఈ కిట్స్ తయారీని అక్కడే చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ వెంటనే గ్రామ వాలంటీర్ల ద్వారా చుట్టుపక్కల మండలాల్లోని టైలర్ల వివరాలను సేకరించారు. ఉప్పాడ, పిఠాపురం, గొల్లపల్లి, యూ.కొత్తపల్లి తదితర మండలాలకు చెందిన వందల మంది టైలర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, పీపీఈ సూట్ల తయారీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, ఇతర శాఖల బాధ్యులు ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నారు.

కేంద్రం నుంచి కూడా..
మూలపేటలో కంపెనీలో ప్రస్తుతానికి రోజుకు 4వేల పీపీఈ సూట్లు తయారవుతున్నాయి. అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని ఇంకా పెంచుకునే వీలుందని బాధ్యులు చెబుతున్నారు. ముందుగా ఏపీ అవసరాల కోసమే అనుకున్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కిట్స్ కోసం వినతులు వస్తున్నాయని ‘పాల్స్ ప్లస్' బాధ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వెల్లడించారు. మేడిన్ ఆంధ్రా పీపీఈలపై కేంద్రం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, భారీగా ఆర్డర్స్ పంపారని ఆయన చెప్పారు.

దక్షిణాదిలో ఏపీనే టాప్..
తూర్పుగోదావరి జిల్లా మూలపేటలో డాక్టర్లు, హాస్పిటిల్ సిబ్బంది ధరించే పీపీఈ కిట్ల తయారీని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా వైసీపీ ఎంపీ అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పీపీఈ కిట్స్ ను పెద్ద ఎత్తున తయారు చేస్తోన్నది ఏపీ ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీ ఆర్డర్లు వచ్చాయని, దీంతో లాక్ డౌన్ వేళలోనూ స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన చెప్పారు. గురువారం విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించిన విజయసాయి.. శానిటేషన్ వర్కర్లు, హోంగార్డులకు సేఫ్టీ కిట్లను అందించడంతోపాటు పలు చోట్ల తాత్కాలిక వసతి కేంద్రాల్లో నిరుపేదలకు భోజనం వడ్డించారు.

గ్రాఫిక్స్, గాలి వార్తలు లేవు..
ఏపీలో కరోనా వైరస్ కట్టడికి సీఎం జగన్ చేయని ప్రయత్నమంటూ లేదని, అవిశ్రాంత కృషితోనే ఇవాళ దేశానికే పీపీఈలు సరఫరా చేయగల స్థితిలో ఉన్నామని ఎంపీ విజయసాయి అన్నారు. అదే సమయంలో జగన్ వ్యతిరేకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ప్రస్తుతం ఏపీలో గ్రాఫిక్స్ మాయాజాలాలు, గాలి వార్తలు లేవని, కేవలం పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. కరోనా నియంత్రణలోలోనేకాదు, ఎక్కువ మందికి టెస్టులు చేయడం, వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ యావత్ దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు.

గుండెలు కాపాడుకోండి..
‘‘జగన్ పదవిలోకి వచ్చి కేవలం 10 నెలలే అయింది. ఇంకా నాలుగేళ్లలో ఎన్నో వండర్స్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి.. చంద్రబాబుతోపాటు ఆయన భజనపరులంతా గుండె దడ రాకుండా హృదయాల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు, లోకేశ్ బాబు.. అక్కణ్నుంచి కుట్రలు చేస్తున్నారు. డాక్టర్ల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా నీచపు పనులకు పాల్పడుతున్నారు. తమ చెంచాలతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ అందరినీ భయాందోళనకు గుచేస్తున్నారు. ఏపీ పట్ల ఏమాత్రం బాధ్యత లేని తండ్రీకొడుకులిద్దరూ కలకాలం హాయిగా హైదరాబాద్ లోనే ఉండండి''అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఏపీలో సీన్ ఇది..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం మధ్యాహ్నం ప్రకటించిన లెక్కల ప్రకారం గత 12 గంటల్లో కొత్త కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 348గానే ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులున్నాయి. విజయనగరం, శ్రీకాకుళంలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా, డాక్టర్లకు కూడా మాస్కులు అందుబాటులోకి లేవంటూ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు సంచలన ఆరోపణలు చేయడం, ఆ వార్తలు జాతీయ మీడియాలో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. సదరు డాక్టర్ ను స్పెండ్ చేసింది. రాష్ట్రంలో వైద్య మాస్కులు, పీపీఈలకు కొరత లేదని చెప్పింది. అంతలోనే తూర్పుగోదావరి జిల్లా మూలపేటలో పీపీఏల తయారీ కూడా ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications