2వేలకు ఓటు అమ్ముకున్న ప్రజలకు.. 2వేల కోట్లు తిన్న చంద్రబాబు పీఏను ప్రశ్నించే హక్కులేదు: పవన్ కల్యాణ్
''ఎన్నికల్లో తమ ఓటను 2వేలకో అంతకంటే ఎక్కువకో అమ్ముకుంటున్న ప్రజలు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి అనే పదం పెద్దదనుకుంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయారు అని సరిచేసుకోవచ్చు. ఈ పనిచేయడం ద్వారా ప్రజలు.. నాయకులను ప్రశ్నించే లేదా నాయకులపై తిరుగుబాటు చేయగలిగే నైతిక హక్కును కోల్పోయారు.
రూ.2వేలకు ఓటు అమ్ముకునే ప్రజలకు.. రూ.2వేల కోట్లు దోచేసిన చంద్రబాబు పీఏ ను ప్రశ్నించే హక్కు లేనేలేదు. ఈ సమాజం చాలా దారుణంగా విచ్ఛిన్నమైపోయింది. అతి తీనావస్థలోకి దిగజారిపోయింది'' అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆన ప్రస్తావించారు.
ఇటీవల ఐటీ శాఖ దాడుల్లో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ద్వారా రూ.2వేల కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు వ్యవహారంపై జనసేన స్పందించడంలేదంటూ వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శల్ని పవన్ ఖండించారు. అవినీతిని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను కాబట్టే గత ఎన్నికల్లో తాను డబ్బులిచ్చి ఓట్లు కొనలేదని, అలా కొనలేనందుకే ఇవాళ జనసేన ఇంతగా ఇబ్బందులు పడుతున్నదని ఆయన చెప్పారు. సమాజంలో మార్పులపై పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
బియ్యం ఇస్తామంటే ఓట్లేశారు..
‘‘ఒక కులం, ఒక జాతి ఓటేసినంత మాత్రాన ఏ పార్టీ గెలవదు. నేను పొలిటికల్ ప్రాసెస్ ప్రారంభించేనాటికి చాలా ఇబ్బంది పడ్డాను. సినిమాల్లో పాపులారిటీ ఉంది కాబట్టి దీన్ని రాజకీయాలకు అనుకూలంగా మార్చుకుందామని రాదేలు. బేసిగ్గా నాకు చిన్నప్పటి నుంచి సమాజాన్ని, అందులోని సమస్యలని అధ్యయం చేసే అలవాటుంది. జనం ఇబ్బందులు, నేతల అవినీతిని చూసినప్పుడు నాకు చాలా విసుగు, ఆవేదన ఉండేది. దాన్ని మార్చడానికి రాజకీయ పార్టీ ద్వారా అద్భుతాలూ జరగాలని లేదు. కానీ ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించినప్పుడు అలాంటి అద్భుతం జరిగింది. అయితే ఆనాటి సామాజిక పరిస్థులు వేరు. ఓటుకు రెండు వేలివ్వడం, బైక్ లు తాయిలాలుగా ఇవ్వడమనే సంస్కృతి అప్పటి రాజకీయాల్లో లేదు. జస్ట్ రూ.2కే కిలో బియ్యం ఇస్తామంటే జనం భారీగా ఓట్లేశారు. కానీ ఇవాళ అలాంటి జనం లేరు.. అలాంటి సమాజమూ లేదు. ఇప్పటి సొసైటీ పూర్తిగా పెడదారి పట్టింది.
తక్షణ పరిష్కారాలు కావాలంటే ఎలా?
మేం సేవ చేస్తాం అని ఎవరైనా ముందుకొస్తే.. వాళ్లను కూడా శంకించే పరిస్థితికి ఈ సమాజం దిగజారిపోయింది. మేం సంపాదించుకుంటాం.. ప్రజల ముఖాన కొంత పారేస్తాం అన్న గత ప్రభుత్వాల విధానమే దీనికి కారణం. ఏ సమస్య అయినా 24 గంటల్లో పరిష్కారం అయిపోవాలని, అదేదో మెడ్ డోనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ లాగా ఫటాఫట్ పనులు జరిగిపోవాలని చాలా మంది అనుకుంటాను. జనసేన పార్టీ అలా స్థాపించగానే.. ఇలా అధికారంలోకి వచ్చేయాలని.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటారు. కానీ నిజంగా రాజకీయాల్లో అలా జరగదు.
చిరంజీవి ఫెయిల్యూర్ చూశాక కూడా..
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా సక్సెస్ కాలేదు. ఇవన్నీ నాకు బాగా తెలుసుకాబట్టే జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు నేను అవివేకంగా మాట్లాడలేదు. దూరదృష్టితో, చాలా లోతుగా సమాజాన్ని అర్థం చేసుకుని, అధ్యయనం చేసి... భవిష్యత్తులో నా రెండు దశాబ్దాల జీవితకాలాన్ని ప్రజలకు ఇవ్వగలనా? రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించకుండా, అవినీతికి పాల్పడకుండా ఉండగలనా? అని ఒకటికి వందసార్లు ప్రశ్నించుకునే ముందడుగు వేశాను. పార్టీకి విరాళాలు తీసుకోవడం తప్పుకాదు. కానీ కాంట్రాక్టులు, ముడుపులు తీసుకుని పార్టీని నడపాలని మాత్రం అనుకోలేదు.
నాతో నేను పోరాడాకే..
ప్రజారాజ్యం పార్టీ దారుణంగా ఫెయిలైన తర్వాత కూడా నేను జనసేన పెట్టగలిగానంటే దాని వెనుక గొప్ప ఉద్దేశముంది. నన్ను నేను టెస్టు చేసుకున్న తర్వాతే.. ఓడిపోతానని తెలసి కూడా నిలబడ్డాను. అందరూ నన్ను తిట్టి వెళ్లిపోయిన తర్వాత కూడా పార్టీని ఒంటరిగానైనా నడపాలని డిసైడ్ అయ్యాకే ముందడుగు వేశాను. అసలిదంతా ఎందుకు చెయ్యాలి? ప్రశ్నిస్తే నాపై కేసులు పెడతారకదా? ఐటీ దాడులు చేస్తారుకదా? అనే భయాలు నాకూ ఉన్నాయి. 2003 నుంచి ప్రజారాజ్యం ఓడిపోయేదాకా ఆ భయాలపై నేను నిరంతరం పోరాడాను. అందుకే 2014లో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదు. ఓటమి అనేది ఒక మెట్టు మాత్రమే. సమాజం దారుణంగా విచ్ఛిన్నమైపోయింది కాబట్టే జనసేన ఇంతగా కష్టపడాల్సి వస్తోంది.
2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోలేదు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోలేదు. ఒకవేళ ఓడిపోయి ఉంటే.. ఇవాళ ప్రజల్లో ఇంత ఆదరణ ఉండేదేకాదు, మనం ఇన్ని మీటింగ్ లు పెట్టుకునేవాళ్లమే కాదు. అదే ఎన్నికల్లో టీడీపీకి జనసేన కంటే 40 శాతం ఓట్లొచ్చాయి కదా.. మరి ఇవాళ టీడీపీవాళ్లు ప్రజల్లో లేనేలేరు కదా. దీని అర్థం ఏంటంటే.. అడ్డదారుల్లో చేసే రాజకీయాలు పనికిరావు. టీడీపీకి దక్కిన 40 శాతం ఓట్లు కొనుక్కుంటే వచ్చాయి. అదే జనసేనకు మాత్రం జనం ఇష్టపడి ఓట్లేశారు. అమరావతి పరిరక్షణ విషయంలో టీడీపీ ఫెయిలైపోయినా.. ఆ ఉద్యమాన్ని ముదుకు నడిపిస్తున్నది జనసేనే అన్నది నిజం. ఇవాళ ప్రజలకు కష్టమొస్తే 151 మంది సభ్యులున్న వైసీపీ దగ్గరికి పోవట్లేదు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుకు వస్తున్నారు. ఆ రకంగా మనం విజయం సాధించినట్లే''అని పవన్ వివరించారు.