తిరుపతిలో అమరావతి సభకు కౌంటర్-బెజవాడలో ఎల్లుండి రాయలసీమ ధర్మదీక్ష
ఏపీలో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కలకలం రేపుతోంది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించేందుకు అమరావతి రైతులు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ సమయంలో వారికి కౌంటర్ గా రాయలసీమ హక్కుల వేదికలు రంగంలోకి దిగుతున్నాయి.
రాయలసీమ హక్కుల కోసం డిసెంబరు13 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో విజయవాడ లో రాయలసీమ ధర్మపోరాట దీక్షను నిర్వహించాలని నిర్ణయ్ంచారు. ఈ మేరకు తాము నిర్వహించే దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి రాయలసీమ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఇందులో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు, క్రిష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలనీ, హంద్రీ-నీవా, గాలేరు - నగరి, తెలుగుగంగ, వెలిగొండ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్యం బోర్డు నోటిఫికేషన్ లో సవరణలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో ఈ నెల 13 న విజయవాడలోని ధర్నా చౌక్ లో రాయలసీమ ధర్మ దీక్షను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ధర్మ దీక్ష లో రాయలసీమలోని అన్ని ప్రజా సంఘాలు పాల్గొననున్నట్లు దశరథరామిరెడ్డి ప్రకటించారు.

రాయలసీమ హక్కుల కోసం జరిగే ఈ ధర్మ దీక్షకు సంఘీభావం తెలియచేయాలని కోరుతూ వై.యస్.ఆర్.సి.పి., తెలుగుదేశం, కాంగ్రెస్, బి.జె.పి.,జనసేన, పార్టీల అద్యక్షులకు మరియు CPI, CPM, న్యూ డెమొక్రసి పార్టీల ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాసి రాయలసీమ ధర్మ దీక్షలో పాల్గొనవలసినదిగా ఆహ్వానించినట్లు ఆయన అన్నారు. మన మనుగడ కోసం, మన భావితరాల కోసం జరిగే ఈ రాయలసీమ ధర్మ దీక్ష లో రాయలసీమ అభిమానులు, రైతులు ఈ ధర్మ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం వై.యన్.రెడ్డి, గోస్పాడు మండల రైతు నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వరనాయుడు, M.V.రమణారెడ్డి లతో కలిసి రాయలసీమ ధర్మ దీక్షకు సంబంధించిన కరపత్రాలను రైతు ప్రతినిధులు విడుదల చేసారు.












Click it and Unblock the Notifications