ఎపి మంత్రి నారాయణపై కేసు నమోదుకు ఆధేశాలు
ఓ పేరెంట్ వేసిన కేసుపై ఫస్ట్ అడిషినల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మొహమ్మద్ రఫీ మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేశారు. నారాయణపై ఐపిసి 403, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన విజయవాడ మాచవరం పోలీసులను ఆదేశించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - విశాఖపట్నంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్గా పనిచేస్తున్న ఐతా రామలింగేశ్వర రావు తన కుమారుడు రామసాయిని విజయవాడలోని నారాయణ విద్యాసంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐఐటి కోచింగ్ బ్రాంచ్లో చేర్పించారు.
అయితే, బోధనా ప్రమాణాలు ఆశించిన మేరకు లేవనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ గానీ యజమానులు గానీ పట్టించుకోలేదు. ప్రమాణాలను నిరూపించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలూ చేయలేదు. దాంతో రావు తన కుమారుడిని అక్కడి నుంచి తీసి మరో కాలేజీలో వేశారు. తనకు రూ.20,400 రూపాయలను తిరిగి ఇవ్వాలని రావు కోరారు.
అయితే, తనంత తాను కాలేజీ నుంచి కుమారుడిని తీసివేసుకున్నందున తాము ఫీజు తిరిగి ఇవ్వబోమని కళాశాల అధికారులు చెప్పారు. దాంతో రామలింగేశ్వర రావు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.