ఎలుకలు కరిచి చిన్నారి మృతి: జగన్ పరామర్శకు నో చెప్పిన కోర్టు! రోజాకు అనురాధ కౌంటర్
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఎలుకలు కరిచి చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు తనకు అనుమతివ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కోర్టును కోరారు.
అయితే, ఆయనకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. విచారణ సమయంలో కోర్టులోనే ఉండాలని చెబుతూ న్యాయస్థానం అందుకు నిరాకరించింది.
కాగా, వైద్యచికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించిన ఆ పసికందుపై ఎలుక దాడి చేసిన విషయం తెలిసిందే. ఒకసారి కాదు.. పదేపదే ఆ చిన్నారి లేత శరీరాన్ని తీవ్రంగా గాయపరిచింది. దీంతో, పసివాడు బుధవారం మృతి చెందాడు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లో ఈ విషాద సంఘటన జరిగింది.
అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు జగన్ గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో కేసు విచారణ కాస్త ఆలస్యంగా న్యాయమూర్తి ముందుకు వచ్చింది. అప్పటి వరకు వేచి చూసిన జగన్, తాను గుంటూరుకు వెళ్లాల్సి వుందని, అందుకు అనుమతించాలని కోరారు.
జగన్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని న్యాయమూర్తికి తెలియజేశారు. కోర్టు విచారణ జరుగుతుంటే నిందితులు ఎక్కడికీ పోకూడని జడ్జి వ్యాఖ్యానించారు. మీ క్లయింటుకు ఈ విషయం తెలియదా? అన్నారు.
ప్యాకేజీల గురించి రోజాకే బాగా తెలుసు: అనురాధ
రాజధానికి ఎంత భూమి కావాలన్న విషయం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని టిడిపి మహిళా నాయకురాలు అనురాధ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ప్యాకేజీల గురించి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.
వాన్ పిక్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కు అప్పట్లో వైయస్ ఎన్నివేల ఎకరాలు ఇచ్చారో రోజా తెలుసుకోవాలన్నారు. జగన్ పైన 11 ఛార్జీషీట్లు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
జగన్కు మతిస్థిమితం సరిగా లేదు: గంటా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు ఎద్దేవా చేశారు. త్వరలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందన్న జగన్ వ్యాఖ్యల పైన ఆయన ధ్వజమెత్తారు. జగన్ తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.