నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికి
ఏపీలో కోవాగ్జిన్ రెండో డోస్ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల పాటు కోవాగ్జిన్ రెండో డోసుల్ని 90 వేల మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్లను ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
మే నెల కు సంబంధంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవిషీల్డ్ టీకాలు వచ్చేశాయని, 78 వేల కొవాగ్జిన్ డోసులు ఇంకా రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రం పంపిన 1,17,980 కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండగా, 90 వేల సెకండ్ డోసులు ఈ రెండురోజుల్లో వేస్తారు. కేంద్ర ప్రభుత్వ నుంచి 4,35,990 కొవిషీల్డ్ డోసులు రాగా, ఏపీ ప్రభుత్వం 12,74,290 డోసులు కొనుగోలు చేసింది.
45 ఏళ్లు నిండి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కొవిషీల్డ్ ఫస్ట్ డోసు ఇవ్వాలని ఆదేశించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి చేపట్టిన టీకా ఫస్ట్ డోస్ వేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. టీకా కేంద్రాల్లో ఎటువంటి రద్దీ లేకుండా, ఎవరికీ ఇబ్బందులు రాకుండా పోలీసు యంత్రాంగం సహకారంతో జిల్లా అధికారులు కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న కొవిషీల్డ్ స్టాక్ ను జూన్ 15 వరకూ ఫస్ట్ డోసుగా వేస్తామని, ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్టాక్ ను బట్టి సెకండ్ డోస్ వేస్తామని తెలిపారు.
Recommended Video
మరోవైపు ఏపీలో రెమిడెసివిర్ ఇంజెక్షన్ల డిమాండ్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రెమిడెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 5,335 రెమిడెసివిర్ ఇంజక్షన్లను వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేశారు. నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వాసుపత్రుల్లో 22 వేలు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 41,818 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా డిమాండ్ లేకపోవడంతో నిల్వలు పెరుగుతున్నాయి.