కరోనా భయం: ఏపీలో మూడు చోట్ల టెస్టింగ్ కేంద్రాలు: ఎక్కడెక్కడంటే..: దేశవ్యాప్తంగా 52..!
అమరావతి: దేశవ్యాప్తంగా రోజురోజుకూ విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రిండానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య రోజురోజుకూ అంచనాలకు మించిన స్థాయిలో పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణలో అనుమానితుల సంఖ్య ఒకేసారి 13కు చేరుకుంది. ఏపీలో ఇంతవరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైనప్పటికీ..బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్లు చెబుతున్నారు.
ఇన్నాళ్లూ ఎన్నికల హడావుడిలో మునిగి తేలి..ఇక కరోనాపై: మంత్రులతో టాస్క్ఫోర్స్: ఢిల్లీలో సాయిరెడ్డి..
అందుబాటులో ఉన్న ఆసుపత్రులు.. మెడికల్ కాలేజీల్లో..
ఈ నేపథ్యంలో.. అనుమానితుల్లో కరోనా వైరస్ జాడలు కనిపించాయా? లేవా? అని నిర్దారించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల కొత్తగా ఈ కేంద్రాలను నెలకొల్పగా.. మరి కొన్ని చోట్ల ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలల స్థాయిని పెంచింది.
ఏపీలో మూడు చోట్ల.. తెలంగాణలో గాంధీలో..
మన రాష్ట్రంలో మూడు చోట్ల కరోనా వైరస్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్), విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, అనంతపురంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో వాటిని నెలకొల్పింది. ఇటలీ నుంచి వచ్చి, కరోనా వైరస్ లక్షణాలతో కనిపించిన నెల్లూరు యువకుడికి స్విమ్స్లో ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రం ద్వారానే నిర్ధారించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక్క చోట మాత్రమే ఈ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటైంది. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాల, ఆసుపత్రిలో దీన్ని నెలకొల్పారు.
కర్ణాటకలో అయిదు చోట్ల..
కరోనా వైరస్ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న కర్ణాటకలో అయిదు ప్రాంతాల్లో ఈ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, బెంగళూరు మెడికల్ కాలేజీల్లో టెస్టింగ్ కేంద్రాలను నెలకొల్పారు. వాటితో పాటు మైసూరు, హసన్, శివమొగ్గల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల, పరిశోధనా కేంద్రాల్లో కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Recommended Video
ఎయిమ్స్ సహా
దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) సహా జమ్మూ కాశ్మీర్, గుజరాత్, బిహార్, అస్సాం, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ, జామ్నగర్లోని ఎంపీ షా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వాటిని నెలకొల్పారు. ఆయా టెస్టింగ్ కేంద్రాలన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే.. దాని నివేదికను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్కు అందజేయాల్సి ఉంటుంది.