ఏపీ కరోనా:‘యాక్టివ్’లో దేశంలోనే టాప్2 - కొత్తగా 9927 కేసులు, 92 మృతి - ఐదు జిల్లాలో ఉధృతంగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 64, 351 శాంపిళ్లను టెస్టు చేయగా, కొత్తగా 9927 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.71లక్షలకు చేరింది.

భారీగా మరణాలు.
రాష్ట్రంలో కరోనా కాటుకు బలైపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 16 మంది, అనంతపురంలో 11, కడపలో 10, ప్రకాశంలో 10, తూర్పు గోదావరిలో 8, పశ్చిమ గోదావరిలో 8, గుంటూరులో 6, నెల్లూరులో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 6, కృష్ణాలో నలుగురు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,460కు పెరిగింది.

తూర్పులో డేంజర్.. ఆ 5జిల్లాలు..
కరోనా కేసులు, మరణాల సంఖ్యకు సంబంధించి ఐదు జిల్లాల్లో ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన రెండు వారాలుగా అత్యధిక కేసులతో తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పులో కొత్తగా 1353 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 52,039కి, మృతుల సంఖ్య 343కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే అత్యధికంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, 967 కొత్త కేసులు వచ్చాయి. నెల్లూరులో 949 కొత్త కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. గుంటూరులో 917 కేసులు, ఆరుగురి మృతి చెందారు. విశాఖపట్నంలో కొత్తగా 846 కేసులు రాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

డిశ్చార్జీలు, టెస్టులు భారీగానే..
ఏపీలో కొత్త కేసులకు దాదాపు సమానంగా డిశ్చార్జీల సంఖ్య ఉంటుండటం గమనార్హం. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 9,419 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,71,639 పాజిటివ్ కేసులకు గాను, 2,78,247 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 64,351 శాంపిళ్లను టెస్టు చేశామని, మొత్తంగా ఏపీలో ఇప్పటిదాకా 33.56లక్షల కరోనా టెస్టులు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే..

యాక్టివ్ కేసుల్లో ఏపీ టాప్-2
కొవిడ్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న తమిళనాడుకు, ఏపీకి తేడా చాలా స్వల్పంగానే ఉంది. అయితే, యాక్టివ్ కేసుల విషయంలో మాత్రం ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అత్యధికంగా దాదాపు 7లక్షల కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.68లక్షలుకాగా, మొత్తం కేసులు 3.85 లక్షలున్న తమిళనాడులో యాక్టివ్ నంబర్ కేవలం 53,282 మాత్రమే. అదే ఏపీలో మాత్రం 3.71లక్షల ఇన్ఫెక్షన్లకుగానూ ఏకంగా 89,932 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications