ఏపీలో కరోనా విలయం: 24 గంటల్లో 61మందికి పాజిటివ్, 1016కి చేరిన సంఖ్య, సిక్కోలులో ముగ్గురికి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసులు వెయ్యి మార్క్ ధాటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. సిక్కోలు శ్రీకాకుళం పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు చనిపోగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. 171 మంది వైరస్ తగ్గి డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1016కి చేరింది. 814 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
కర్నూలులో కలవరం
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 275కి చేరింది. తర్వాత గుంటూరులో 209, కృష్ణా జిల్లా 127 కేసులతో మూడోస్థానంలో.. 73 కేసులతో చిత్తూరు నాలుగోస్థానంలో ఉంది. కానీ 24 గంటల్లో చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్టణం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం ఊరట కలిగించే అంశం
విజయనగరంలో నో..
రాష్ట్రంలో ఇప్పటివరకు విజయనగరంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాలేదు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పటివరకు కేసు నమోదు కాలే.. కానీ శుక్రవారం ఒక్క కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 24 గంటలు గడిచే సరికి కేసుల సంఖ్య మూడుకి చేరింది. వైరస్ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులకు పాజిటివ్ వచ్చినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్లో ప్రకటించింది.
సిక్కోలులో 3
సిక్కోలుకు చెందిన ఓ వ్యక్తి మార్చి 19వ తేదీన ఢిల్లీ వెళ్లొచ్చారు. అయితే అతనికి వైద్య పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. అతనిని క్వారంటైన్లో ఉంచారు. కానీ అతని అత్తగారిల్లు కూడా 5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తరచూ వెళ్లేవాడు అని తెలుస్తోంది. క్వారంటైన్ నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించాడు. అతని క్వారంటైన్ ముగిసినా పరీక్ష చేయగా సస్పెక్ట్ వైరస్ వచ్చింది.
సెకండరీ కాంటాక్ట్
శనివారం అతని భార్య, పిల్లలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. సెకండరీ కాంటాక్ట్ ద్వారా అతని కుటుంబసభ్యులకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. కానీ ఢిల్లీ వెళ్లొచ్చిన అతనికి తిరిగి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. జేమ్స్ ఆస్పత్రిలో నెగిటివ్ రాగా.. కాకినాడకు తరలించారు. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. కానీ అతని కుటుంబసభ్యులకు మాత్రం పాజిటివ్ వచ్చింది.