ఏపీలో కరోనా: 5జిల్లాల్లో ఉధృతి -కొత్తగా11,434 కేసులు, ఒకేరోజు 64 మరణాలు -వ్యాక్సినేషన్ ఆలస్యం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులతోపాటు మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ లక్ష మార్కుకు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ ప్రభావం చూపుతుండగా, ఐదు జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా మారింది. వైద్యసేవల విస్తరణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై జగన్ సర్కారు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆ ఐదు జిల్లాల్లో భారీగా..
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,435 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,54,875కు పెరిగింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో వెయ్యికిపైగా కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2028 కొత్త కేసులు, చిత్తూరులో 1982, శ్రీకాకుళం 1322, నెల్లూరు 1237, విశాఖపట్నం జిల్లాలో 1067కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో అనంతపురం 702, విజయనగరం 633, కృష్ణా 544, ప్రకాశం 497, కర్నూలు 474, పశ్చిమ గోదావరి 242, కడప 271, తూర్పు గోదావరి జిల్లాలో 243 కొత్త కేసులు నమోదయ్యాయి.

పెరిగిన మరణాలు..
ఏపీలో కొత్త కేసులతోపాటు కొవిడ్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,800కి చేరింది. విజయనగరంలో అత్యధికంగా 8 మంది చనిపోగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

1లక్ష యాక్టివ్ కేసులు, వ్యాక్సిన్లు ఆలస్యం
గడిచిన 24 గంటల్లో 7,055 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 9,47,629కి చేరింది. అయితే, కొత్త కేసులు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు మళ్లీ లక్ష మార్కుకు చేరువైంది. ప్రస్తుతం ఏపీలో 99,446 యాక్టివ్ కేసులున్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 40 పడకల ఆస్పత్రులను పూర్తిస్థాయి కొవిడ్ సెంటర్లుగా మార్చాలని, ఒకవేళ ఆస్పత్రి భవంతులు లేకుంటే కాలేజీల్లోనే కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశమంతటా మే1న ప్రారంభం కానుండగా, ఏపీలో మాత్రం జూన్ 1 నుంచి టీకాల పంపిణీ ఉంటుందని, రిజిస్ట్రేషన్ లో ఆలస్యం, వ్యాక్సిన్ తయారీదారులతో ఒప్పందాల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కారు వెల్లడించింది.












Click it and Unblock the Notifications