ఏపీలో కరోనా: గుడ్ న్యూస్ - తగ్గిన వైరస్ వ్యాప్తి - మెరుగ్గా గణాంకాలు - ఆ మూడు జిల్లాలో టెన్షన్
కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాకాల్లో వెల్లడైంది. సాధారణంగా ఆదివారం వైద్య సిబ్బందికి సెలవు రోజు కావడంతో ఆరోజు టెస్టుల సంఖ్య తగ్గడం, అదే క్రమంలో కొత్త కేసుల సంఖ్యా స్వల్పంగా వచ్చేవి. కానీ సోమవారం నుంచి గురువారం వరకు భారీ ఎత్తున టెస్టులు చేపట్టినప్పటికీ.. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం, అదే సమయంలో డిశ్చార్జీలు భారీగా ఉండటం శుభపరిణామం.

5,145 కొత్త కేసులు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన గణాకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,145 పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.44 లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 6,159కు పెరిగింది. కేసులు మరణాల పరంగా పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే కనిపిస్తున్నది.

జిల్లాల వారీగా..
తాజా లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 862 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరులో 757, తూర్పు గోదావరిలో 738, ప్రకాశం జిల్లాలో 486 కేసులు వచ్చాయి. మరణాల విషయానికొస్తే, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, విశాఖపట్నంలో నలుగురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

కొత్తవి తగ్గాయి.. డిశ్చార్జీలు పెరిగాయి..
ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 70,521 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో కేవలం 5145 మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. గురు, బుధ, మంగళవారాల్లోనూ 70వేల పైచిలుకు టెస్టులు నిర్వహించగా, కొత్త కేసుల సంఖ్య ఐదువేలకు కాస్త ఎక్కువగా మాత్రమే నమోదయ్యాయి. ఇక రికవరీల విషయానికొస్తే, శుక్రవారం ఒక్కరోజే 6,110 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య దాదాపు ఏడు లక్షలకు(6.91లక్షలకు పెరిగింది. ప్రస్తుతానికి ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 47,665గా ఉంది.












Click it and Unblock the Notifications