ఏపీలో ఇక ఆ ఆస్పత్రులన్నీ కరోనాకే -భవంతుల్లేకుంటే కాలేజీల్లో -104 ద్వారా గంటల్లో బెడ్లు: సీఎం జగన్
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. వివరాలివి..

ఇకపై వాటిని కొవిడ్ సెంటర్లుగా
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 40 పడకల ఆస్పత్రులు అన్నిటినీ ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్గా మార్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఉండేలా చర్యలు చేపట్టింది. ఒకవేళ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో 40 పడకల ఆస్పత్రి గనుక లేకపోయినట్లయితే, స్థానికంగా ఉన్న కాలేజీ భవంతులనే కొవిడ్ సెంటర్లుగా మార్చనున్నారు. ఈ మేరకు అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రోజుకు 12వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

104కు ఫోన్ చేస్తే 3గంటల్లో బెడ్
ఏపీలో 104 కాల్ సెంటర్లను మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని, కోవిడ్ సమస్యలకు 104 నంబర్ వన్స్టాప్ సొల్యూషన్ గా వ్యవహరించాలని, ఆ దిశగా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. మంగళవారం నాటి సమీక్షలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై ఆయన దిశానిర్దేశం చేశారు. ''104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్ సెంటర్కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని'' అని సీఎం ఆదేశించారు.

ఆరోగ్య శ్రీపై కీలక ఆదేశాలు
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు.. కాసుల కక్కుర్తితో తమ వద్ద చేరిన కరోనా పేషఎంట్లను అవసరానికి మించి ఎక్కువ రోజులు ఉంచున్నారని, ఈ మేరకు పేషెంట్లు, వారి బంధువులపై ఆస్పత్రి యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిపై ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ సాంకేతిక కమిటీ అన్నీ పరిశీలించాకే రోజు వారీ ప్యాకేజీలు నిర్ణయించామని, దీన్ని కాదని ఆస్పత్రులు ప్యాకేజీ డబ్బుల కోసం ఎక్కువ రోజులు ఉండాలని ఒత్తిడి చేయడంతగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే ప్యాకేజీ డబ్బులు ఇస్తామని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications