కంచ అయిలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధం ధైర్యం ఉందా?: సిపిఐ
ప్రోఫెసర్ కంచ అయిలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు.
విజయవాడ: ప్రోఫెసర్ కంచ అయిలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కంచ ఐలయ్యపై నిందలు, బెదిరింపులు, దాడులు ఆపడంతో పాటు ఆయనపై పెట్టిన బెయిలుకు వీలులేని కేసును ఎత్తివేయాలని డిమాండ్చేశారు.
కంచ ఐలయ్యపై దాడులను ఖండిస్తూ.. దళిత, బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
వివిధ సామాజిక అంశాలతో కూడిన ప్రస్తుత పుస్తకం ముఖచిత్రం, పేరు.. ఆర్యవైశ్య సంఘాల అభ్యంతరానికి కారణంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉందన్నారు.
ఎవరి స్వేచ్ఛకు విఘాతం కలిగించే హక్కు ఇతరులకు లేదని పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకోవాలే తప్ప భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు.
ఈ వివాదంలో పరిపూర్ణానంద స్వామి జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నించారు రామకృష్ణ. కారంచేడు, చుండూరుల్లో దళితులపట్ల దాడులు జరిగినప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు జోక్యం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. పుస్తకాన్ని నిషేధించాలంటూ టీజీ వెంకటేష్ కోరిన మీదట ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తుండడం సరికాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
గరగపర్రులో 500 దళిత కుటుంబాలను వెలివేసి పస్తులు బెడితే ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఆగ్రామానికి వెళ్లలేదని విమర్శించారు. పుస్తకాన్ని నిషేధిస్తే 13 జిల్లాల్లో పెద్దఎత్తున నిరసనలు చేపడతామన్నారు. ఐలయ్యకు ఏవిధమైన హాని జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అయిలయ్యను బెదిరించడాన్ని సమర్ధించనన్న కెటిఆర్
భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను అవమానించే హక్కు కాదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.. కంచ ఐలయ్యకు పోలీసు రక్షణ గురించి ఓపాత్రికేయురాలు గురువారం ట్విట్టర్లో చేసిన అభ్యర్థనపై మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. ఐలయ్యకు వచ్చిన బెదిరింపులను తాను సమర్థించడం లేదన్నారు. ఓవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అలా చేయడమే అభ్యంతకరమని చెప్పారు. బెదిరింపుల గురించి పోలీసులు సమీక్షిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.