'వర్సిటీల్లో రాజకీయాలొద్దా, మీరు చేశారుగా', కాపును లాగిన మందకృష్ణ
విజయవాడ: విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చేయవద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ఎలా చెబుతారని సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణలు గురువారం నాడు ప్రశ్నించారు.
వారు మాట్లాడుతూ... వర్సిటీల్లో రాజకీయాలు వద్దని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చంద్రబాబు రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రాజకీయం చేయకుండానే వెంకయ్య నాయుడు పైకి వచ్చారా అని నిలదీశారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు వలే ఇప్పటి ప్రభుత్వాలు కరువు పింఛన్లు ఇవ్వాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ హంతకుని పొగిడే వాళ్లు దేశభక్తులా అని నిలదీశారు.
భగత్ సింగ్ వ్యాఖ్యల విషయంలో వెంకయ్య నాయుడు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఉరితీసే సమయంలో భగత్ సింగ్ భారత్ మాతాకీ జై అనలేదని, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారన్నారు. ఇష్టం ఉన్న వాళ్లు భారత్ మాతాకీ జై అంటారని, లేనివాళ్లు ఊరుకుంటారని చెప్పారు.
చంద్రబాబు పదేళ్ల క్రితమే హామీ ఇచ్చారు: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ పైన ఏపీ సీఎం చంద్రబాబు పదేళ్ల క్రితమే హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గురువారం అన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చి పదేళ్లవుతోందన్నారు. కాపులకు మాత్రం ఏడాది కూడా కాకుండానే రిజర్వేషన్ దిశగా అడుగులు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తాను చేపట్టిన విశ్వరూప యాత్రకు అనుమతించాలని మందకృష్ణ కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న పోలీసుల వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ.. పిటిషన్ కొట్టివేసింది. దీనిపై మందకృష్ణ మాట్లాడుతూ.. తాను డివిజన్ బెంచ్కు వెళ్తానని చెప్పారు.