'మోడీని వందసార్లు కాల్చినా తప్పులేదు, బిచ్చగాళ్లు కూడా బాధపడ్తున్నారు'
ప్రధాని నరేంద్ర మోడీని వందసార్లు కాల్చినా తప్పులేదని సిపిఐ నేత నారాయణ సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 127 కోట్ల ప్రజల గుండెల్లో గునపాలు దింపాడని నిప్పులు చెరిగారు.
రాజమహేంద్రవరం: ప్రధాని నరేంద్ర మోడీని వందసార్లు కాల్చినా తప్పులేదని సిపిఐ నేత నారాయణ సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 127 కోట్ల ప్రజల గుండెల్లో గునపాలు దింపాడని నిప్పులు చెరిగారు. బ్లాక్ మనీ ఉన్న వారిని కాపాడటం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టాడన్నారు.
ఆయన శిక్షార్హుడో కాదో ప్రజా కోర్టులో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దును కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు మహాయజ్ఞంతో పోల్చాడని, కానీ బ్లాక్ మనీనీ, కార్పోరేట్ సంస్థలను కాపాడేందుకు ఈ మహాయజ్ఞం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వారి మహాయజ్ఞానికి, ప్రజల ఆక్రోశానికి మధ్య జరిగే పోటీనే సోమవారం నాటి బంద్ అన్నారు. ప్రజలు దీనిని విజయవంతం చేయాలన్నారు. ఏ పార్టీలు ప్రజల వైపో ఇప్పుడు తేలిపోతుందన్నారు. క్యూలలో బాధపడేది సామాన్య ప్రజానీకమేనని, కార్పోరేట్ సంస్థల అధిపతులు ఎవరూ నిలబడరన్నారు. నోట్ల రద్దుతో బిచ్చగాళ్లు సైతం బాధపడుతున్నారన్నారు.
నోట్ల రద్దుపై మైసూరా పిటిషన్
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు ఖాతాదారులకు అకౌంటులోని సొమ్మును ఇవ్వకపోవడంపై మాజీఎంపీ మైసూరా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. బ్యాంకుల తీరు ఐపీ పెట్టిన మాదిరిగా ఉందన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. మంగళవారం వాదనలు జరగనున్నాయి.