పవన్ కళ్యాణ్ ఓ జోకర్: 'ఏపీలో ఇంత జరుగుతుంటే ఎక్కడ పడుకున్నాడు'
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాపుల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేసి, ఆసుపత్రిలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.
ఎప్పుడో ఓ సారి మీడియా ముందుకు వచ్చి పవన్ నీతులు చెబుతున్నారని, అవి వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ జోకర్ అని అభివర్ణించారు. ఏపీలో కాపు ఉద్యమం కోసం ముద్రగడ తీవ్రంగా శ్రమిస్తుంటే, కాపులకు అండగా ఉంటానని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ పడుకున్నారన్నారు.
మీడియా ముందుకు హీరోలా వచ్చి జీరోలా వెళ్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం మీద దాడిచేస్తే టీఆర్ఎస్ తన పతనానికి పునాది వేసుకోవడమేనని హెచ్చరించారు.
కోదండరాం టీఆర్ఎస్ పాలనపై ఎందుకు విమర్శలు తెలుసుకుని దాన్ని గుర్తించి పాలనను చక్కదిద్దుకోవాల్సిందిపోయి టీఆర్ఎస్ నాయకులు ఆయనపై ప్రతివిమర్శలు చేయడం అవివేకమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఇదిలా ఉంటే తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలోనూ దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభానికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దీక్ష శనివారంనాటికి మూడో రోజుకు చేరుకుంది.
భార్యతో కలిసి ఆయన ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఆయనకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన దానిని ప్రతిఘటించారు.