హోదా సాధించకుంటే: రామకృష్ణ తీవ్ర వ్యాఖ్య, 'బాబు ఏకపాత్రాభినేయం వల్లే'
కర్నూలు/అనంతపురం: రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని, లేకుంటే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు హిజ్రాలతో స్వాగతం పలుకుతామని సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం హెచ్చరించారు.
గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు. లక్షల మందిని ఆహ్వానించిన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదన్నారు. 27 మంది మృతికి కారణమైన తొక్కిసలాటపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
చంద్రబాబుపై వైసీపీ ధ్వజం
గోదావరి పుష్కరాల పైన చంద్రబాబు ఏకపాత్రాభినేయం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని వైసీపీ నేతలు రాజశేఖర రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ తమనే టార్గెట్ చేస్తోందన్నారు.
రాష్ట్రాభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ నేతలు దృష్టి పెట్టకుండా తమ నేతల పైన అక్రమ కేసులు పెట్టే పనిలో ఉన్నారన్నారు. టిడిపి ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. అధికారులను పార్టీలో చేర్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.