టిడిపి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలులేదు...సిఎం కుర్చీ కోసం బిజెపితో జగన్:వామపక్షాలు
కడప:జగన్, చంద్రబాబు ఇద్దరు దొంగలేనని...వారికి ప్రజా సమస్యలు పట్టవని...వచ్చే ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించాలని సిపిఐ,సిపిఎం నేతలు దుయ్యబట్టారు.
అధికార , ప్రతిపక్షాల తీరును వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు రెండువైపుల నుంచి చేస్తున్న బస్సు యాత్ర కడప జిల్లా మైదుకూరుకు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీల నేతలు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆ రెండు పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు సంక్షేమందించని టిడిపి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదని అన్నారు. గత ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల తేడాతో 70 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే...జగన్ సిఎం కుర్చీ కోసం మతతత్వ బిజెపి పార్టీతో కలిసేందుకు ఉత్సాహపడుతున్నారని వారు ధ్వజమెత్తారు.
అధికార టిడిపి, ప్రతిపక్షం వైసిపిలను తూర్పారబడుతూ వామపక్షాలు రాష్ట్రం రెండు దిక్కుల నుంచీ బస్సు జాతాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఒకవైపు నుంచి ప్రారంభించిన సిపిఎం,సిపిఐ బస్సుయాత్ర జాతా ప్రొద్దుటూరు యాత్ర ముగించుకొని మైదుకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా మైదుకూరు సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఓబులేసు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అందించని టిడిపి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదన్నారు.
సిఎం కుర్చీ కోసం, అధికారం కోసం జగన్ మతతత్వ పార్టీ బిజెపి పార్టీతో కలిసేందుకు ఉత్సాహపడుతున్నారని విమర్శించారు. అనంతరం సిపిఎం నాయకురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోరే వామపక్షాలను ప్రజలు ఆదరించాలని న్నారు. అధికారమే లక్ష్యంగా భావించే బిజెపి, టిడిపి, వైసిపి, కాంగ్రెస్ లను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.
మరోవైపు విశాఖలో బస్సు జాతా ప్రారంభం సందర్భంగా శనివారం పాత జైలు రోడ్డులో సభ ఏర్పాటుచేశారు. దానిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిపిఎం నేత రాఘవులు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలు కల్లబొల్లి కబుర్లు చెపుతూ అధికారాన్ని చేజిక్కించుకుంటాయని... ఆ తరువాత ప్రజలను వంచిస్తాయని...వాటిని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యామ్నాయంపై విధానం రూపొందించి, ప్రజల మధ్యకు తీసుకువెళ్లటానికే ఈ జాతాలని ఆయన వెల్లడించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ గతంలో రాజకీయ ప్రత్యామ్నాయ యత్నాలన్నీ విఫలమైనా ఈసారి జనసేన కలవటంతో తమ వ్యూహం విజయవంతం అవుతుందని చెప్పారు.
అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో బ్రోకర్లు లేరని ఇటీవలే ప్రధాని మోడీ చెప్పారని గుర్తుచేశారు. అయితే అంబానీ, ఆదానీతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి పనులు చేసుకుంటూ...ఆర్ఎస్ఎస్ నాయకులతో బ్రోకరు పనులు చేయించుకుంటున్న ప్రధాని మోడీనే అందరి కన్నా పెద్ద బ్రోకర్ అని వ్యాఖ్యానించారు.