సర్వే నివేదికలతో సగం చచ్చిపోతున్న నేతలు.! సర్వే ఫలితాలతో నిద్రపట్టడం లేదంటున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : సర్వే ఫలితాలు చూసి ఆనందించాల్సిన రాజకీయ నేతలు ఉలిక్కిపడుతున్నారు. నియోజక వర్గాల్లో తమ పనేంటో తాము చేసుకెళ్తున్నప్పటికి సర్వే నివేదికలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అవును.. రాజకీయ సర్వేలకు అర్ధం మారుతోంది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల పుణ్యమాంటూ ఎవరికి వారే సెపాలజిస్టులుగా మారిపోతున్నారు. దారినపోయే నలుగురితో మాటలు కలిపి, వారు చెప్పిన దానినే నియోజకవర్గ ఫలితంగా ఆపాదిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాష్ట్ర రాజకీయాలకు, ఎన్నికలకు ముడిపెడుతూ నివేదికల రూపంలో విడుదల చేస్తున్నారు.
కేసీఆర్ అలా చేస్తే..జగన్ ఊరుకుంటారా : వైసిపి 22 సీట్లు గెలిస్తే.. : విజయశాంతి కీలక కామెంట్లు..!
గుబులు రేపుతున్న సర్వే రిపోర్టులు..! అయోయమంలో నేతలు..!!
ఇంతకీ, సర్వేల్లో ఎంత వరకూ నిజం ఉంటుంది, ఎంత వరకు నమ్మొచ్చు, ఏది ఆబద్దం అనేది చెప్పటం చాలా కష్టం. గుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా ఎవరికి వారు తమ లెక్కలు వేసుకుంటూ, స్వయం ప్రకటిత మేధావి తనాన్ని జనం మీదకు రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే.. వీటికి రుజువులు అక్కర్లేదు. ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్లందుకు పైసలతో పనిలేదు.. ఇవన్నీ బోగస్ అని తేలినా.. శిక్షించే చట్టాల్లేవు అందుకే.. ఏదోఒక సంస్థ పేరుతో ప్రధానపార్టీల అభిమానగణం లెక్కలతో సహా బయటపెడుతున్నాయి.
నిద్రలేకుండా చేస్తున్న నివేదికలు..! చిరాకు పడుతున్న నేతలు..!!
ఇవన్నీ ఆయా పార్టీలను అభిమానించే వారికి కాస్త ఉత్సాహాన్ని నింపేవి. నాయకుల్లో మాత్రం అయోమయాన్ని పెంచేవిగా మారుతున్నాయి. చివరకు తాము అంటకాగే పార్టీల మెప్పుకోసం ప్రధాన పత్రికలు, ఛానళ్లు కూడా ఇదే అడ్డదారిలో వెళ్లటం వింతగా ఉంది. ఏదేమైనా, ఏపీలో సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సర్వేల వివరాలు చూస్తే రాజకీయ నేతల గుండెలు తరుక్కు పోవాల్సిందే..!
ఎవరికి తోచిన లెక్కలు వారివి..! ప్రాముఖ్యత కోల్పోతున్న సర్వేలు..!!
వైసీపీ 104, టీడీపీ 60, జనసేన 11, వైసీపీ 90-103, జనసేన 40-45, టీడీపీ 22 , మరో సర్వే మరీ ఘోరం.. జనసేన 130, వైసీపీ 20, టీడీపీ 25 .. ఎవరికి వారు.. తమకు అనుకూలమైన సర్వేలతో ఏది నిజమో.. ఏది నకిలీయో తెలియనంతగా మార్చేస్తున్నారు. వీటికి ఒకడు.. లగడపాటి సర్వే అంటే.. మరొకడు పీకే సర్వే అంటాడు.. మూడోవాడు మరో అడుగు ముందుకేసి.. ఇది ఏపీ ఇంటిల్జెన్స్ సర్వే అంటూ ఊదరగొడుతున్నారు. నేతలు తమ ప్రచారం, వ్యూహాలతో ముందుకు నడవాల్సింది, సర్వేలను చూసి అయోమయానికి గురౌతున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ అలా చేస్తే..జగన్ ఊరుకుంటారా : వైసిపి 22 సీట్లు గెలిస్తే.. : విజయశాంతి కీలక కామెంట్లు..!
సర్వేలంటేనే బెంబేలెత్తుతున్న పార్టీలు..! ఆశ్చర్యానికి గురౌతున్న ప్రజలు..!!
నిజంగానే తమ పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉంది.. ప్రజలు తమ గురించి సానుకూలంగా ఉన్నారా.. ప్రతికూలంగా ఉన్నారా అనేది అర్ధం చేసుకునేందుకు తలలు పట్టుకుంటున్నారట నేతలు. ఓ విధంగా చెప్పాలంటే, సర్వేల పేరిట నియోజకర్గాల్లో గెలిచే నేతలను కూడా గందరగోళంలో పడేస్తున్నారు. తమకు అనుకూలమైన మీడియాలోనూ ఇటువంటి సర్వేల కథనాలు రావటంతో కొందరు నేతలు ప్రచారాన్ని వదిలేసి ప్రయివేటు వ్యక్తులతో తమ సొంత సర్వేలు చేయించుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. అంటే సర్వే నివేదికలు రాజకీయ నేతలను ఎంతగా అయోమయానికి గురిచేస్తున్నాయో తెలుస్తోంది.