అమరావతిలో రెండో విడత భూ సమీకరణ వేళ రైతుల బిగ్ ట్విస్ట్..!!
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఆర్డీఏ ప్రభుత్వ నిర్ణయం మేరకు రెండో విడత భూ సమీకరణ ప్రారంభించింది. ఈ సేకరించిన భూముల్లో ప్రభుత్వ ప్రాజెక్టు ల వివరాలను వెల్లడించింది. మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో రైతులు కొత్త డిమాండ్లు తెర మీదకు తెచ్చారు. తమకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.
రాజధాని ప్రాంతంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్తో కలిసి రైతుల నుంచి నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు. ఈ సమయంలోనే కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి. రైతులు మంత్రి నారాయణ.. అధికారులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసారు. అమరాతి రాజధానిగా చట్టబద్దత ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

ప్రభుత్వం మారితే మళ్లీ అమరావతి భవిష్యత్ ఏంటని నిలదీసారు. ఇప్పటి వరకు అభివృద్ధి ఎక్కడ చేసారో చెప్పాలంటూ డిమాండ్ చేసారు. చట్టబద్దత ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.. మూడేళ్ల కాలంలో అభివృద్ధి జరగకుంటే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని వారిని వివరించారు.
కాగా, ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్లూరు.. అమరావతి మండలాల్లోని 7 గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. తుళ్లూరు మండలంలో వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉండగా.. అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ఉన్నాయి.
సేకరించిన భూమిని రాజధానికి అవసరమైన కీలక ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నారు. అంతర్జాతీయ విమానా శ్రయం, రైల్వే ట్రాక్ నిర్మాణం, స్మార్ట్ పరిశ్రమలు, క్రీడా నగరం,ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం కేటాయించనున్నట్లు వెల్లడించారు. లేఔట్లలో ముందుగా రెండు వరుసల బిటి రోడ్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మౌలిక వసతుల కల్పన పూర్తి కాగానే రైతులకు వారి ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించేలా అథారిటీ చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications