ఏపీలో రెండు రోజుల్లో భారీగా కరోనా బాధితుల డిశ్చార్జ్ లు- ప్రభుత్వం అంచనా..
ఏపీలో కరోనా వైరస్ కేసులపై ప్రభుత్వం తాజాగా నిర్వహించి సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో గత రెండు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మరణాలు నమోదు కాలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి డిశ్చార్జ్ లు కూడా ఉంటాయని తెలిపారు.
ఏపీలో తాజా పరిస్ధితిని గమనిస్తే దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా ఉంది. అదే సమయంలో కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కిట్లు కూడా ఫలితాన్నిస్తున్నాయి. దీంతో పరీక్షల వేగం కూడా పెరిగింది. కాబట్టి సహజంగానే వేగంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా చికిత్స అందిస్తున్న రోగుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో త్వరలో భారీ సంఖ్యలో డిశ్చార్జ్ లు ఉండే అవకాశ ముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగితే రోగుల సంఖ్య కూడా తగ్గవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.