Hanuma Vihari: మళ్లీ ఏపీకి క్రికెటర్ హనుమ విహారి-లోకేష్ తో భేటీ-వైసీపీపై సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రా క్రికెట్ రాజకీయాలను తట్టుకోలేక ఎన్వోసీ తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాను ఎదుర్కొన్న అవమానాలను ఈ సందర్భంగా విహారి గుర్తుచేసుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రా క్రికెట్ సంఘం హనుమ విహారిని జట్టు కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది. తిరుపతికి చెందిన ఓ వైసీపీ కార్పోరేటర్ కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారంటూ విహారి స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న అతనిపై తాను అరిచానన్న కోపంతో ఆయన తండ్రి అయిన వైసీపీ కార్పోరేటర్ ఏసీఏపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు విపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హనుమ విహారి తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ మంత్రి లోకేష్ తో భేటీ అయిన విహారి గతానుభవాలను గుర్తు చేసుకున్నారు. అంతే కాదు వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు విహారి తెలిపారు.
తన టాలెంట్ను గత ప్రభుత్వం తొక్కేసిందని, ఒక్క మ్యాచ్ ఆడగానే రిజైన్ చేయాల్సిందే అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తనపై ఒత్తిడి తీసుకొచ్చారని విహారి తెలిపారు. తాము చెప్పిన వారిని టీమ్లో పెట్టుకోకపోతే సహించమంటూ తనతో బలవంతంగా రాజీనామా చేయించారన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. లోకేష్ హామీతో ఇప్పుడు తిరిగి ఏపీ జట్టుకు వస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications