తిరుమలలో స్మృతి మంధాన
Smriti Mandhana: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 75,449 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,121 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.91 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది.

భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరుమలకు వచ్చారు. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో స్మృతి మంధానకు తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు.
అనంతరం ఆలయం వెలుపల తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. సుదీర్ఘకాలంగా తిరుమలకు రావాలని అనుకుంటోన్నానని, అది ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నానని అన్నారు.
ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చారు స్మృతి. ఆ టూర్లో పరుగుల వరద పారించారు. అరుదైన రికార్డు నెలకొల్పారు. మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. తొలి వన్డేలో 117, రెండో మ్యాచ్లో 136 పరుగులు చేశారు. బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలను బాదారు. మూడు మ్యాచ్ల్లో 343 పరుగులు చేశారు.












Click it and Unblock the Notifications