ఇంత స్వేచ్ఛ జనసేనలోనే: బయోడేటా ఇచ్చిన క్రికెటర్ వేణుగోపాల రావు, ఇతర ప్రముఖులు
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చేయాలనుకున్న ఆశావహులు తమ బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీలకు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం 150 మంది ఆశావహులు తమ బయోడేటాలు స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు.

క్రికెటర్ వేణుగోపాల రావు సహా ప్రముఖులు బయోడేటాలు ఇచ్చారు
జనసేన పార్టీ అభ్యర్థిత్వం కోసం యువ క్రికెటర్ వేణుగోపాల రావు కూడా తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. తమకు బయోడేటాలు సమర్పించిన ప్రముఖులలో మాజీ ఎమ్మెల్యే రాపాపాక వరప్రసాద్, జనసేన నేతలలు సత్య బొలిశెట్టి, ముత్తం శెట్టి కృష్ణారావు, గిరజిన, ఎస్సీ హక్కుల కోసం పోరాడినవారు, భూసేకరణ అమలులో లోపాలపై న్యాయపోరాటాలు చేసినవారు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరపున, ఆ ప్రాంతంలో ఎస్టీల పక్షాన నిలిచిన నాయకులు, రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు మీడియా ప్రతినిధులు, పదవీ విరమణ పొందిన సైనికాధికారులు, సైనికులు, ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగినప్పుడు నిర్వహించిన కమెండో ఆపరేషన్స్లో పాల్గొన్న ఓ విశ్రాంత అధికారి బయోడేటాలు సమర్పించారని తెలిపింది.

ఇంత స్వేచ్ఛ జనసేనలో మాత్రమే
ఏడు బలమైన సిద్ధాంతాలు కలిగిన జనసేన పట్ల తమకు నమ్మకం ఉందని, ఈ సిద్ధాంతాలపై నిబద్దతతో ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారానే పాలనలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నట్లు బయోడేటా ఇస్తున్నా వారు చెబుతున్నారని జనసేన తెలిపింది. రాజకీయాల్లో అభ్యర్థిత్వం కోసం తమ పేరు పరిశీలించమని కోరేందుకు ఇంత స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించిన పార్టీ ఒక్క జనసేన మాత్రమే అని పేర్కొంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్లతో కూడిన కమిటీ బయోడేటాలను పరిశీలిస్తోందన్నారు. అభ్యర్థుల వివరాలు, రాజకీయ అనుభవం, అవగాహన గురించి తెలుసుకుంటుందని చెప్పారు.
జనసేన పార్టీలో వీరు
ఈ సందర్భంగా జనసేన మరో ట్వీట్ చేసింది. 'ప్రజలకు మేలు చేసేందుకు కదిలిన మేధావులు, వారి కలయికకు వేదికగా మారిన జనసేన' అని పేర్కొంది. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, ఆర్థికవేత్త పుల్లారావు, అబ్దుల్ కలాంకు సలహాదారుగా పని చేసిన పొన్నురాజ్, ఎన్నారై వ్యాపారవేత్త పులి శేఖర్, ప్రముఖ విద్యావేత్త విష్ణురాజు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ డీజీపీ రవి కుమార్, ప్రొఫెసర్ సుధాకర్ రావు, రచయిత వీవీ రామారావు వంటి మేధావులు తమ పార్టీలో ఉన్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications