పెద్దల సభలో పిల్ల చేష్టలు - సభాపతులనూ లెక్కచేయని వైనం- లోకేష్ తీరుపై సర్వత్రా విమర్శలు...
టీడీపీకి మెజారిటీ సభ్యుల బలమున్న ఏపీ శాసనమండలిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రవర్తనాశైలి నానాటికీ శృతి మించుతోంది. మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడటం వరకూ సమర్ధనీయమే అయినా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడం ద్వారా సభ గౌరవాన్ని దిగజారుస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై మరోసారి మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ మంత్రులు సిద్ధమవుతున్నారు.
నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆక్రోశం
పెద్దల సభగా మండలి గౌరవం
అసెంబ్లీలో ఉండే రెండు సభల్లో ఎగువ సభ అయిన శాసనమండలికి ప్రత్యేక గౌరవం ఉంది. ఇక్కడ జరిగే చర్చలు గతంలో మేథావులను సైతం రంజింపజేసేవి. కానీ ఏపీ శాసనమండలిలో పరిస్ధితి మాత్రం నానాటికీ దిగజారుతోంది. ప్రభుత్వాలు తమకు కావాల్సిన బిల్లులను పట్టుబట్టి నెగ్గించుకునే ప్రయత్నంలో వ్యవహరిస్తున్న తీరు, వాటిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలు, ఈ మధ్యలో జరుగుతున్న వాగ్యుద్ధాలు, అసభ్య సన్నివేశాలు ప్రజల్లో మండలిపై చులకన భావం ఏర్పడేలా చేస్తున్నాయి.
నారా లోకేష్ వ్యవహారం...
గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన అనుభవం లేకపోయినా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్..నేరుగా మండలికి ఎన్నికయ్యారు. అప్పట్లో లోకేష్ ను మంత్రిగా చేయడం కోసం ఎమ్మెల్సీగా చంద్రబాబు గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఐటీ మంత్రిగా పనిచేసిన లోకేష్ కు చట్ట సభలు, వాటి గౌరవం, నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. కానీ అదే ఇప్పుడు లోపించినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ మంత్రులు రెచ్చిపోతున్నారన్న సాకుతో వారిని సభలోనే దూషించేందుకు సిద్ధమవుతున్న తీరు, ఫోన్లో వారిని చిత్రీకరించేందుకు పడుతున్న తపన చూస్తుంటే పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతుంది.
మంత్రులు, సభాపతులు వారిస్తున్నా...
శాసనమండలి సమావేశాలను ప్రభుత్వం కొంతకాలంగా లైవ్ ప్రసారం చేయడం లేదు. ఇదే అదనుగా మంత్రుల వ్యవహారశైలిని జనంలోకి తీసుకెళ్లే పేరుతో లోకేష్ తన ఫోన్ కు పని చెప్తున్నారు. మంత్రులు వెల్ లోకి వచ్చినా, దూషణలకు దిగినా లోకేష్ ఫోన్ తీసి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ అప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ తీరుపై మంత్రులు, వైసీపీ సభ్యులతో పాటు సభాధ్యక్ష స్ధానంలో ఉన్న వారు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎవరినీ లెక్క చేయని పరిస్ధితి.
Recommended Video
నిబంధనలు ఏం చెబుతున్నాయి ?
శాసనమండలిలోనే కాదు శాసనసభలోనూ సభాపతుల నిర్ణయమే అంతిమం. వారు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సభలోకి సభ్యులు తీసుకొస్తున్న ఫోన్లలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషిద్ధం. లైవ్ ప్రసారాలు ఉన్నా, లేకున్నా సభ్యులు ఇష్టారాజ్యంగా షూటింగ్ చేయడం నిబంధనలకు విరుద్దం. గతంలోనూ అలాంటి సంప్రదాయాలు లేవు. కానీ లోకేష్ మాత్రం ఎవరినీ లెక్కచేయకుండా ఫోన్లలో అధికార పార్టీ నేతలను షూట్ చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సభాపతులను కూడా లెక్కచేయకపోవడాన్ని చూస్తే చట్టసభలపై, సభాపతులపై ఆయనకున్న గౌరవం అర్ధమవుతోందని అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా నిన్నటి మండలి సమావేశంలోనూ సభాధ్యక్ష స్ధానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ వారిస్తున్నా లోకేష్ ఏమాత్రం పట్టించుకోకుండా షూటింగ్ కొనసాగించారు. దీనిపై మరోసారి ఛైర్మన్ కు ఫిర్యాదు చేయాలని వైసీపీ సిద్ధమవుతోంది.