టీటీడీ నిర్వాకం : ఆ కిరీటాలను చూసే చాన్స్ ఇక లేదు ! వాటినేం చేశాడో తెలుసా ?
తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీగోవిందరాజుల స్వామి వారి కిరీటాలు చోరీకి గురైన ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు కిరీటాల దొంగను అరెస్టు చేయగలిగారు గానీ.. ఆ కిరీటాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. కారణం- కిరీటాలను కొట్టేసిన కొద్దిరోజుల తరువాత.. ఆ దొంగ వాటిని కరిగించేశాడు. బంగారు కడ్డీలుగా మార్చాడు. ఆ కిరీటాల రూపురేఖలు కాదు కదా.. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేసేశాడు. అతని వద్ద కిరీటాలకు సంబంధించిన ఫొటోలు కూడా లేవని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని నేరస్తుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
భక్తుడిగా ఆలయానికి వెళ్లి.. కిరీటాలపై కన్నేసి
నేరస్తుడి పేరు ఆకాశ్ ప్రకాష్ సరోదే. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలో నివాసి. చిన్నా, చితకా వ్యాపారాలు చేస్తుండేవాడు. తిరుపతికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరిలో మొదటిసారిగా గోవిందరాజుల స్వామి వారి ఆలయానికి వెళ్లాడు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో మూలవిరాట్టులకు అలంకరించిన కిరీటాలపై అతని కన్ను పడింది. దీనికోసం మరి కొన్ని సార్లు ఆలయానికి వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భక్తుల రద్దీ లేని సమయం చూసి, మూడు కిరీటాలను చోరీ చేశాడు. వాటిని తీసుకుని, నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లిపోయాడు. కిరీటాలు చోరీకి గురైన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కిరీటాల చోరీ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
రేణిగుంటలోనే చిక్కాడు..
ఆలయ ప్రాంగణంలో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కేసు దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా మారింది. అయినప్పటికీ... ఆలయం వెలుపల దుకాణాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఓ వైన్ షాపు వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో మొదటిసారిగా ఆకాశ్ ప్రకాష్ ను గుర్తించారు. అనంతరం- రైల్వేస్టేషన్, బస్టాండ్ కు దారి తీసే మార్గాల్లో అమర్చిన కెమెరాలను పరిశీలించాగా.. రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు తేలింది. ఏ రైలులో వెళ్లినదీ గుర్తించారు. సీసీటీవీల్లో లభించిన ఫుటేజీ ఆధారంగా అతని ఫొటోను ముద్రించి, విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికోసం సోషల్ మీడియాను కూడా వినియోగించారు తిరుపతి పోలీసులు. చివరికి- అతని పేరు, ఊరు కనుగొన్నారు. మొదటిసారిగా తెలంగాణలోని నిజామాబాద్ లో అతని ఉనికి తెలిసింది. అక్కడ ఆరా తీయగా.. నాందెడ్ జిల్లావాసి అని స్పష్టమైంది. అతని స్వగ్రామానికి వెళ్లి విచారించారు. ఇది తెలుసుకున్న ఆకాశ్.. అక్కడి నుంచి ఉడాయించాడు. అహ్మద్ నగర్ కు మకాం మార్చాడు. పోలీసులు అక్కడికీ వెళ్లగా.. తప్పించుకున్నాడు. రైల్లో చెన్నై వెళ్తుండగా.. పోలీసులు రేణిగుంటలో ఆకాశ్ ను వలవేసి పట్టుకోగలిగారు.
మూడుచోట్ల కిరీటాలను విక్రయించడానికి ప్రయత్నం..
కిరీటాలను యథాతథంగా మూడు ప్రాంతాల్లో విక్రయించడానికి ప్రయత్నించగా.. కుదరలేదని ఆకాశ్ వెల్లడించినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తొలుత- తిరుపతి నగర శివార్లలోని రేణిగుంటలో మొదట కిరీటాలను విక్రయించడానికి ప్రయత్నించగా బెడిసికొట్టింది. అనంతరం- రైలులో కాచిగూడకు చేరుకుని, అక్కడ కూడా కిరీటాలను అమ్మడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడట. వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో..పుణేలో తనకు పరిచయం ఉన్న నగల వ్యాపారుల వద్ద వాటిని విక్రయించడానికి ప్రయత్నించగా.. వారు అంగీకరించలేదు. దీనితో- కిరీటాలను కరిగించి కడ్డీలుగా మార్చాడని ఎస్పీ తెలిపారు. వాటి మొత్తంగా కిరీటాల బరువు 1651 గ్రాముల బరువు ఉన్నట్లు తేలింది. బులియన్ మార్కెట్లో వాటి విలువ 42.35 లక్షల రూపాయలుగా తేలిందని ఎస్పీ చెప్పారు.