వివేకా హత్యకేసులో కీలక మలుపు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్యకేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ మంజూరు చేయడానికి సరైన కారణాలు కనిపించడంలేదని, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సబబేనంటూ విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసం పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఒకప్పుడు ఆయన దగ్గర పనిచేసినవారే ఈ హత్యలో పాల్పంచుకున్నారు. కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే నిందితులెవరూ సహకరించడంలేదని, ఇలా అయితే ఏపీలో తన తండ్రి కేసు దర్యాప్తు సజావుగా సాగదంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
దాదాపు ఏడునెలల తర్వాత సీబీఐ అధికారులు తాజాగా ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేస్తున్నారు. వివేకా హత్యకు వాడిన ఆయుధాలు దొరికయాంటూ ప్రచారం జరిగిందికానీ, అధికారులు ఎంత ప్రయత్నించినా వాటిని కనిపెట్టలేకపోయారు. సీబీఐ అధికారులకు కూడా ఈ కేసులో సాక్షుల నుంచికానీ, ఇతరత్రాకానీ ఎటువంటి సహకారం అందడంలేదు. ఈ విషయాన్ని వారు తమ ఛార్జిషీటులో పేర్కొన్నారు.