Srisailam: వీడియో: కృష్ణమ్మ పరవళ్లు: వరుసగా నాలుగో ఏడాదీ ఫుల్: శ్రీశైలం గేట్ల ఎత్తివేత
కర్నూలు: వరుసగా నాలుగో సంవత్సరం కూడా కృష్ణానది జలకళను సంతరించుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. గరిష్ఠ స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. వరద నీటితో పోటెత్తుతోంది. ఇన్ఫ్లో తగ్గకపోవడంతో.. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ మూడు గేట్లను ఎత్తారు. వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో తీవ్రత ఆధారంగా మరో రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉంది.
మూడు గేట్లు ఎత్తివేత..
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా, తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల శుక్రవారం నాటికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. 1.92 లక్షల క్యూసెక్కుల వరదనీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతోంది. రాత్రికి నీటిమట్టం 881.30 అడుగులకు చేరింది. దీనికి అనుగుణంగా ఇన్ఫ్లో మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో గేట్లను ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. కొద్దిసేపటి కిందటే మూడు గేట్లను ఎత్తేశారు.
దిగువకు వరద నీరు..
ఎగువన కురుస్తోన్న వర్షాల వల్ల శ్రీశైలం రిజర్వాయర్లోకి వచ్చే ఇన్ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులను దాటుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా గేట్లను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వరద జలాల ప్రభావంతో ఇక పులిచింతల, నాాగార్జున సాగర్ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జున సాగర్ క్రమంగా నిండుతోంది. గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది.
సాగర్ వైపు పరుగులు..
ఒకట్రెండు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగితే- నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తే అవకాశాలు లేకపోలేదు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ రెండు నదులు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వరద తాకిడి అంచనాలకు మించిన స్థాయిలో ఏర్పడింది.
కృష్ణమ్మకు పూజలు
కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన ఆలమట్టి సహా నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. మంత్రితో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమ్మకు పూజలు చేశారు. నదీమతల్లికి హారతి పట్టారు. వరుసగా నాలుగో సంవత్సరం కూడా శ్రీశైలం వంటి భారీ రిజర్వాయర్ నిండటం శుభపరిణామమని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, వరద నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.