CM OSDతో కలిసి ప్రయాణం చేయడం అబద్ధం: జవహర్ రెడ్డి
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా తాను ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఒకే వాహనంలో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో విజయవాడకు ప్రయాణం చేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని, బాధ్యులు క్షమాపణలు చెప్పకపోతే న్యాయనిపుణుల సలహా మేరకు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకానికి ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే నిర్ణయించారని జవహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 11.00 గంటలకు రేణిగుంట నుంచి కడప వెళ్లానని, 3వ తేదీ ఉదయం కడప జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం తాను విద్యనభ్యసించిన ముద్దనూరు జడ్పీ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యానన్నారు.

ఆ తరువాత 4.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోగా కలెక్టర్ తోపాటు ఇతర అధికారులు తనకు వీడ్కోలు పలికారని చెప్పారు. రాత్రి 9.00 గంటలకు స్పైస్జెట్ ఎస్జీ 3003 సిరీస్ ద్వారా 1 డి సీట్లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నట్లు వివరించారు. ఇవన్నీ వాస్తవాలుకాగా వాటన్నింటినీ పక్కనపెట్టి ఓఎస్డీతో కలిసి విజయవాడ వెళ్లారని, ఒకే వాహనంలో ప్రయాణిచారంటూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ రెడ్డి పీఏ నవీన్ ను విచారించినరోజు.. వారి విచారణ పూర్తయిన తర్వాత దూరంగా వేచిచూస్తున్న సీఎస్ తన వాహనంలో వారిని ఎక్కించుకొని విజయవాడ వరకు కలిసి ప్రయాణం చేశారంటూ వార్తలు వచ్చాయి. వాటిని సీఎస్ తాజాగా ఖండించారు.












Click it and Unblock the Notifications