నాడు అన్నా..నన్ను నడిపించండి అన్నారు: నేడు ధిక్కారమంటూ తప్పించారు: సీఎస్ బదిలీ వెనుక అసలు విషయం..!
నాకు అధికారం కొత్త. సుబ్రమణ్యం(సీఎస్) అన్న..గౌతమ్ (డీజీపీ) అన్న..నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకొనే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే నన్ను వీరిద్దరూ గైడ్ చేస్తారు. అన్నలు అందరం కలిసి పని చేద్దాం. ప్రజలకు మంచి చేద్దాం. మీరంతా నాకు సహకరించాలి..అంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో ముఖ్యమంత్రి జగన్ అధికారుల ఇష్టా గోష్టిలో చెప్పిన విషయం. ఇప్పుడు అదే ..తాను అన్నగా పిలుచుకొని..తాను సీఎస్ గా కంటిన్యూ చేసుకున్న ఎల్వీ సుబ్రమణ్యం తన ఆదేశాలనే ధిక్కరించారంటూ బదిలీ చేసారు.
గతంలో ఎల్వీ సుబ్రమణ్యం..జగన్ కేసుల్లో ఉన్నారంటూ చంద్రబాబు సైతం ఆరోపణలు చేసారు. అయితే, ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేయటం పైన రాజకీయంగానూ విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో సీఎంఓ వర్గాలు మాత్రం సీఎస్ బదిలీ చేయటం వెనుక అనేక కారణాలు బయటకు తెచ్చారు. అధికారుల్లో మాత్రం ఈ వ్యవహారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం జగన్ ఆదేశాలనే పట్టించుకోలేదా?: ఏపీ సీఎస్ బదిలీ వెనుక కొత్త కోణాలు
సీఎం ఆదేశాలు అమలు చేయలేదా..
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అమలు చేయలేదనే వాదన తెర మీదకు వచ్చింది. కొన్ని శాఖల అధికారులుగా సీఎం సూచించిన పేర్లు సీఎం నేరుగా చెప్పినా ఫలితం ఉండడంలేదు. తనకు నచ్చడంలేదనే వ్యక్తిగత కారణంతో రోజులు తరబడి.. ఐఏఎస్ అధికారుల నియామకాలు నిలిచిపోతున్నాయని..ఇది ఉల్లంఘన కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ప్రవీణ్ ప్రకాష్కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆరెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్కు తెలియకుండా జరిగినవి కావని చెబుతున్నారు. వైయస్సార్ పేరుమీ లైఫ్టైం అవార్డులు ..గ్రామ న్యాయాలయాలు అంశం సీఎస్కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. సీఎం ఎదుట ఓకే అని, ఆతర్వాత కొర్రీ పెట్టడం సీఎస్పై ఆగ్రహానికి దారితీసింది.
జగన్ దాపరికం లేకుండా నడుచుకున్నా..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తన సమక్షంలో, తనకు తెలిసీ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సీఎస్ కూడా పాటించాల్సి ఉన్నా... అలా కాక సాంకేతిక అంశాలను చూపించి, ఆ నిర్ణయాలను సవాల్ చేసేలా నిలుపుదల చేయడం, సీఎంకు తనకు చెప్పినా సరే.. మళ్లీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీచేయడాన్ని ఏముఖ్యమంత్రికూడా అంగీకరించరని ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. దీనిని ప్రభుత్వ వ్యవస్థను నడిపే అధినాయకుడిగా ఏ ముఖ్యమంత్రికూడా చూస్తూ ఊరుకోరనేది వారి వాదన. ఇవన్నీ చూసిన తరువాతనే..తప్పని స్థితిలో సీఎస్ ను బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
సీఎం నిర్ణయం ఏం సంకేతాలు ఇచ్చింది..
ముఖ్యమంత్రిగా తన అదేశాల అమలు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠినంగానే ఉంటాననే సంకేతాలు ముఖ్యమంత్రి ఇచ్చారు. అయితే, ఇదే సమయంలో తన కార్యదర్శికి సీఎస్ నోటీసులు ఇవ్వటం పైనా సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారి సమస్య ఉంటే అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని..నోటీసుల వరకు తీసుకెళ్లటం.. ఆ తరువాత అది మీడియాకు లీక్ అవ్వటం వంటివి సీఎం సహించలేకపోయారు. అయితే, ఇదే సమయంలో ముఖ్యమంత్ర సైతం హెచ్చరించి..ఆ తరువాత బదిలీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఎవరినైనా ఎంతగా అభిమానిస్తారో...నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే కఠినంగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలచు కుంటున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పు బడుతున్నాయి.